‘రేపు వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం’

31 May, 2021 22:22 IST|Sakshi

61.46 లక్షల మంది పెన్షనర్లకు రూ.1497.62 కోట్లు విడుదల

2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ

ఈనెలలో 29,961 మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు

మూడు రోజుల్లో నూరుశాతం పెన్షన్లను పంపిణీ చేయాలి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 29,961 మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మంగళవారం (జూన్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు.

ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1497.62 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశామని, సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే  పెన్షన్ మొత్తాలను అందచేస్తామని అన్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, అలాగే ఆర్‌బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ మొత్తాలను మూడు రోజుల్లో నూరుశాతం పంపిణీ పూర్తి అయ్యేలా వలంటీర్లను ఆదేశించామని అన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల డిఆర్‌డిఎ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు.

చదవండి: కోవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌, ఆక్సిజన్‌ సరఫరాపై సీఎం జగన్‌ సమీక్ష

మరిన్ని వార్తలు