ఒక్కరోజే 97శాతం మందికి పింఛన్

2 Aug, 2020 03:45 IST|Sakshi
శ్రీకాకుళంలోని చేపల వీధిలో వృద్ధాప్య పింఛను అందిస్తున్న వలంటీర్‌ సోనీ

లబ్ధిదారుల ఇళ్ల వద్దే రూ.1,411 కోట్లు పంపిణీ చేసిన వలంటీర్లు

పలు చోట్ల వర్షంలోనూ కొనసాగిన పంపిణీ 

ఈ నెల నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్, కళాకారుల పింఛన్లు కూడా వలంటీర్ల ద్వారానే

సాక్షి, అమరావతి: ఆగస్టు1వ తేదీ రాగానే మళ్లీ 59,01,280 మంది అవ్వాతాతలకు ఠంచన్‌గా పింఛన్‌ సొమ్ములు చేతికి అందాయి. వలంటీర్లు శనివారం ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్‌ అందజేశారు. 
► పలు జిల్లాల్లో వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించారు.
► 97 శాతం మంది లబ్ధిదారులకు ఆగస్టు 1నే పింఛన్‌ చేతికి అందింది.
► ఈ నెల ప్రభుత్వం పింఛనుదారుల కోసం రూ.1,478.89 కోట్లు విడుదల చేయగా శనివారం రాత్రి 8 గంటల సమయానికి రూ.1,411.38 కోట్లు పంపిణీ పూర్తయింది. 
► గత నెల వరకు పేద బ్రాహ్మణులు, కళాకారులు బ్యాంక్‌ ఖాతాల ద్వారా పింఛన్లు అందుకుంటుండగా ఈ నెల వలంటీర్లు వారి ఇళ్లకే వెళ్లి పంపిణీ చేశారు. 
► కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫొటోలను తీసుకుని వలంటీర్లు నగదు అందజేశారు. 
► శనివారం విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక శాతం పింఛన్ల పంపిణీ పూర్తవగా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యల్ప శాతం పంపిణీ జరిగినట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. 
► లాక్‌డౌన్, తదితర కారణాల వల్ల గతంలో రెండు నుంచి ఆరు నెలలపాటు పింఛన్‌ తీసుకోని 1,21,895 మందికి పాత బకాయిలతో కలిపి పింఛన్లు అందించారు. 

మరిన్ని వార్తలు