గొల్లపల్లి యువకుడు భార్గవ్‌కు లక్కీ ఛాన్స్‌.. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం 

1 Dec, 2022 07:07 IST|Sakshi
భార్గవ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): మండలంలోని గొల్లపల్లికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి లక్కీఛాన్స్‌ కొట్టాడు. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతంతో క్వాల్‌కాం మల్టీ ఇంటర్నేషనల్‌ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్‌ (ఎంటెక్‌) చదువుతున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి ఇంకా పట్టా తీసుకోకముందే రూ.కోట్ల కొలువు దక్కించుకున్నాడు.

ఆయన చదువు డిసెంబర్‌లో పూర్తి కానుండగా, అతని నైపుణ్యం గుర్తించిన క్వాల్‌కాం కంపెనీ అంతకుముందే ఏడాదికి రూ. 1.70 కోట్లు ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. చదువు పూర్తికాగానే క్వాల్‌కాంలో చేరనున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి అధునాతన చిప్‌ల తయారీపై పనిచేయాల్సి ఉంటుంది. భార్గవ్‌ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే అతనికి రూ. 20 లక్షలు స్కాలర్‌ షిప్‌ ఇవ్వడం విశేషం.

ఈ సందర్భంగా భార్గవ్‌ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, అలివేలమ్మ మాట్లాడుతూ.. తమ కుమారుడు ఏడాదికి రూ.కోటి సంపాదించే ఉద్యోగంలో చేరతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివే తమ కుమారుడి ప్రతిభ గుర్తించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థలు ఫీజుల్లో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చాయన్నారు.   

చదవండి: (పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు)

మరిన్ని వార్తలు