రెమ్‌డెసివిర్‌ తయారీకి రెడ్డీస్‌ ల్యాబ్‌కు అనుమతి

8 May, 2021 04:55 IST|Sakshi

అగనంపూడి (గాజువాక): దువ్వాడ వీఎస్‌ఈజెడ్‌ ఆవరణంలోని రెడ్డీస్‌ ల్యాబ్‌లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతులు మం జూరయ్యాయి. ఈ మేరకు దువ్వాడ వీఎస్‌ఈజెడ్‌ పరిపాలనా భవనంలో నిర్వహించిన యూనిట్‌ అప్రూవల్‌ కమిటీ (యూఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూఏసీ చైర్మన్, వీఎస్‌ఈజెడ్‌ జోనల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆవుల రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డీస్‌ ల్యాబ్‌తోపాటు మరో సంస్థ ఫ్ట్రాక్సీ దరఖాస్తు చేశాయని, ముందుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు అనుమతిచ్చామని తెలిపారు. రెడ్డీస్‌ ల్యాబ్‌  జూన్‌ నాటికి ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తుందన్నారు.

నెలకు వంద మిల్లీ లీటర్ల సామర్థ్యంతో 3.5 లక్షల బాటిళ్లు, 5 వందల మిల్లీలీటర్ల సామర్థ్యంతో 7 లక్షల ఇంజక్షన్లు తయారు చేసేలా యూనిట్‌ను  సిద్ధం చేస్తున్నట్టు రెడ్డీస్‌ ల్యాబ్‌ హెడ్‌ మీనన్‌ చెప్పారని తెలిపారు. ఇప్పటికే నక్కపల్లి సెజ్‌లోని హెట్రో డ్రగ్‌ ద్వారా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు తయారు చేస్తున్నారని, అలాగే  ఏపీసెజ్‌లోని లారస్‌ కంపెనీ  38.3 మిలియన్‌ హెచ్‌సీక్యూ టాబ్‌లెట్లను అమెరికా, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెనడా, బెల్జియమ్, మయన్మార్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయన్నారు. కోవిడ్‌ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నక్కపల్లిలోని ఆనర్‌ ల్యాబ్‌కు వంద కేజీల మాల్నూపిరవీర్‌ మందుల తయారీకి అనుమతులిచ్చినట్లు ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు