-

ఫోటో తీసుకుందామని వందే భారత్‌ ట్రైన్‌ ఎక్కాడు..డోర్లు లాక్‌ అవ్వడంతో..

17 Jan, 2023 14:52 IST|Sakshi

రాజమహేంద్రవరం: ‘ఎరక్కపోయి ఇరుక్కున్నాడు’ అనే సామెత తాజా ఘటనకు అచ్చం సరిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్‌ ట్రైన్‌ పట్టాలెక్కి ఇంకా రెండు రోజులు కాలేదు.. ఒక వ్యక్తి ఫోటో కోసం ట్రైన్‌ ఎక్కేశాడు. సెల్పీ తీసుకుందామని భావించి ట్రైన్‌ స్టేషన్‌లో ఆగిన వెంటనే అందులోకి అమాంతం దూకేశాడు. చకచకా సెల్పీలు తీసుసుకున్నాడు. కానీ ట్రైన్‌ డోర్లు ఆలోమేటిక్‌గా లాక్‌ అవుతాయనే విషయం గ్రహించలేకపోయాడు. అంతే డోర్లు లాక్‌తో ట్రైన్‌లో ఇరుక్కుపోయి ఫైన్‌ చెల్లించుకున్నాడు. అంతే కాదు.. మళ్లీ స్టాప్‌ వచ్చే వరకూ మనోడి దిగే పరిస్థితి లేకుండా పోయింది.

వందే భారత్‌ ట్రైన్‌ రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో ఆగిన సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ట్రైన్‌ ఎక్కేశాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ లోపు డోర్లు లాక్‌ అయిపోయాయి.  అంతే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటూ చూసినా చేసే పరిస్థితి ఏమీ లేకుండా పోయింది. ఈలోపు టీసీ వచ్చి టికెట్‌ అడిగేసరికి అసలు విషయం బయటపెట్టాడు. తాను ఫోటోలు కోసం ట్రైన్‌ ఎక్కానని, డోర్లు ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతాయనే విషయం తెలియదన్నాడు. టీసీ కూడా తాను కూడా ఏమీ చేసే పరిస్థితి లేదని, వచ్చే స్టేషన్‌ వరకూ ఆగాల్సిందేనని చెప్పేశాడు. దాంతో పాటు జరిమానా కూడా విధించాడు టీసీ. ఇక చేసేది లేక ఫైన్‌ చెల్లించాడు మనోడు. రాజమండ్రిలో ట్రైన్‌ ఎక్కినవాడు చివరకు విజయవాడలో దిగాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు