సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి మొదలైన తరువాత హైకోర్టు తొలిసారిగా భౌతిక విచారణ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునళ్లతో పాటు హైకోర్టులో కూడా ఈ నెల 20 నుంచి హైబ్రీడ్ (భౌతిక, ఆన్లైన్ విధానం) విధానం ద్వారా కేసులను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రయోగాత్మక పద్ధతిలో హైబ్రీడ్ విధానాన్ని మొదలు పెడుతున్నట్లు హైకోర్టు వర్గాలు తెలిపాయి.
ఇందుకు విధివిధానాలను త్వరలో హైకోర్టు జారీచేయనుంది. భౌతిక విచారణ ఎలా ఉండాలి.. కోర్టు హాళ్లలోకి ఎవరిని అనుమతించాలి.. ఎంతమందిని అనుమతించాలన్న అంశాలపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. ఏదేమైనా కూడా కోవిడ్ మార్గదర్శకాలకు లోబడే హైబ్రీడ్ విచారణ ఉంటుంది. అప్పటివరకు అన్ని కోర్టులూ ఆన్లైన్లోనే కేసులను విచారించాల్సి ఉంటుంది. అక్టోబర్ మొదటి వారంలో మరోసారి సమీక్ష జరిపి పూర్తిస్థాయి భౌతిక విచారణపై నిర్ణయం తీసుకుంటారు.