పరారీలో ఫిజియోథెరపిస్ట్‌.. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ!

17 Jan, 2023 07:35 IST|Sakshi
రఘువీరప్రసాద్‌

రూ.3 కోట్ల వరకు అప్పులు 

ఐపీ నోటీసులు జారీ చేసి.. అజ్ఞాతంలోకి.. 

లబోదిబోమంటున్న బాధితులు  

సాక్షి, అనంతపురం: అప్పులు చేసి.. తిరిగి ఇవ్వకుండా ఫిజియోథెరపిస్ట్‌ పరారైన ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసనగర్‌లో ఫిజియోథెరపిస్ట్‌ రఘువీరప్రసాద్‌ ఫిజియోథెరపీ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. తనవద్దకు ఫిజియో థెరపీ కోసం వచ్చే వారితో పాటు స్నేహితులు, సన్నిహితుల నుంచి అప్పులు తీసుకున్నాడు.  

మంచివాడని, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ డబ్బు ఎక్కడికి పోతుందిలే అన్న ధైర్యంతో అందరూ ధర్మ వడ్డీకి ఇచ్చారు. అలా రూ.3 కోట్ల వరకు అప్పులు చేసిన రఘువీర ప్రసాద్‌ రియల్‌ ఎస్టేట్, షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ తనవద్ద డబ్బులు లేవని, అప్పు చెల్లించే పరిస్థితిలో లేనని ఐపీ నోటీసులు పంపాడు.

ఫిజియో థెరపిస్ట్‌ ఇంటికి తాళం వేసి భార్య, పిల్లలు, తల్లితో కలిసి పరారయ్యాడు. ధర్మ వడ్డీ పేరుతో తమ వద్ద డబ్బు తీసుకుని ఇప్పుడు నోటీసులు పంపితే ఎలా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఎగ్గొట్టే చర్యలకు పాల్పడుతున్న ఇతనిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త)

మరిన్ని వార్తలు