శంబర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆర్జేసీ సురేష్బాబు
ఆలయాభివృద్ధికి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచన
సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించినట్టు రాజమహేంద్రవరం ఆర్జేసీ ఎం.వి.సురేష్బాబు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా శంబర గ్రామంలోని పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు.
అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఏయే పనులు అవసరమో, ఎంత నిధులు అవసరమో ప్రణాళికలు తయారు చేసి అందించాలని ఈవో వి.రాధాకృష్ణను ఆదేశించారు.
ఫలించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర కృషి
శంబరపోలమాంబ అమ్మవారు (గిరిజనుల దేవత) జాతర రాష్ట్రంలో అతిపెద్ద జాతరని, అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గిరిజన సంక్షేమ శాఖమంత్రి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలోని సమ్మక్క, సారక్క జాతరకు ఉన్నంత విశిష్టత ఆంధ్ర రాష్ట్రంలో శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు ఉందని వివరిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శంబర పోలమాంబ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా గుర్తింపునివ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.