పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్‌ నిర్మాణం పూర్తి

9 Sep, 2021 14:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కోక్కటీ పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుంది. ఓవైపు వరదలు మరో వైపు కరోనా వంటి విపత్కర పరిస్దితులున్నా.. అనుకున్న లక్ష్యం సాధించే దిశగా పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-3 నిర్మాణం పూర్తయ్యింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌ సీఈ సుధాకర్‌ బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్యాప్‌-3 కాంక్రీట్‌ పనులను పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన ఈ గ్యాప్‌-3 కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పూర్తి చేసింది. 

153.50 మీ పొడవు, 53.320మీ ఎత్తు, 8.50 మీ వెడల్పుతో గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్‌ నిర్మాణం పూర్తయ్యింది. దీనికి గాను 23,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ని వినియోగించినట్లు అధికారులు తెలిపారు. పోలవరం హెడ్ వర్క్స్‌లో 3 ఈసీఆర్ఎఫ్ డ్యాంలలో గ్యాప్-3 ఒకటి. గ్యాప్-1, గ్యాప్-2 ఈసీఆర్ఎఫ్‌లు రాక్ ఫిల్ డ్యామ్‌లు కాగా గ్యాప్-3 మాత్రం కాంక్రీట్ డ్యామ్‌. (చదవండి: పోలవరం పనులపై ప్రాజెక్ట్‌ అథారిటీ సంతృప్తి)

గ్యాప్-3 కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణ పూర్తి సందర్భంగా నిర్వహించిన పూజాకార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ గిరిధర్ రెడ్డి, ఈఈలు పాండురంగారావు, మల్లిఖార్జునరావు, ఆదిరెడ్డి, డీఈఈ ఎమ్.కె.డి.వి ప్రసాద్, ఏఈఈ శ్రీధర్, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ఎం.ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, ఏజిఎంలు కె.రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు.


(చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్‌)

పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్‌..
మేఘా ఇంజనీరింగ్ సంస్ద 2019 నవంబర్ లో పనులు చేపట్టింది.
ఇప్పటికే కీలకమైన పోలవరం స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తైంది.
స్పిల్ వే లో 3,32,295 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేయడం జరిగింది.
అదే విధంగా స్పిల్ వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లకు గానూ 42 గేట్లను అమర్చడం జరిగింది.
మిగిలిన 6గేట్లను త్వరలోనే అమర్చనున్నారు.
రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84 సిలిండర్లను అమర్చారు.
ఇప్పటికే 24పవర్ ప్యాక్ లకు గానూ 24 పవర్ ప్యాక్ లు అమర్చారు.
ఇప్పటికే అన్ని గేట్లను పైకి ఎత్తి ఉంచడంతో గేట్ల ఏర్పాటు తర్వాత మొదటి సారి అన్ని గేట్ల నుండి గోదావరి వరద దిగువకు ప్రవహిస్తోంది.
అదేవిధంగా 10రివర్ స్లూయిజ్ గేట్లను అమర్చడంతో పాటు వాటిని ఇప్పటికే పైకి ఎత్తి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది.
స్పిల్ ఛానెల్‌లో 2,41,826 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.
అదే విధంగా స్పిల్ ఛానెల్ లో 35 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.
దీనికి తోడు స్పిల్ ఛానెల్ లో కీలకమైన 1,391మీటర్ల పొడవైన ఎండ్ కటాఫ్ వాల్ నిర్మాణ పనులు సైతం పూర్తి అయ్యాయి.
ఇంక అప్రోఛ్ ఛానెల్ లో దాదాపు 70లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ఇది కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం.
కీలకమైన ఎగువ,దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఎగువ కాఫర్ డ్యాంలో 33,73,854, క్యూబిక్ మీటర్ల  పనులు పూర్తి అయ్యాయి.
ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను 2480మీ పొడవున, 42.5మీటర్ల ఎత్తు కు గానూ పూర్తి స్దాయి ఎత్తున నిర్మాణం పూర్తి అయింది.
ఇంక దిగువ కాఫర్ డ్యామ్‌ నిర్మాణం సైతం దాదాపు 21మీటర్ల ఎత్తులో నిర్మాణం పూర్తి అయింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో ఇప్పటికే 3,15,237 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి.
ఇటీవలే ఎగువ కాఫర్ డ్యామ్‌ దగ్గర అడ్డుకట్ట వేసి గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్ళించడం పూర్తైంది.
ఇలా అప్రోచ్ ఛానెల్ నుంచి స్పిల్ వే మీదుగా గోదావరి నదిని దాదాపు 6.6కి.మీ మళ్ళించడం జరిగింది.
ఇప్పటికే గ్యాప్2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ నిర్మాణానికి సంబందించి 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి.
అదేవిధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి.
ఇంక గ్యాప్-1లో 400మీటర్ల పొడవున ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యామ్‌ నిర్మాణం పూర్తి అయింది.
గ్యాప్-1లో నేలను గట్టి పరిచేందుకు స్టోన్ కాలమ్స్ పనులు పూర్తి అవ్వగా కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఆసియాలో మొదటి సారి ఆధునిక టెక్నాలజీతో గ్యాప్-1లో డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి.
ఇంక కీలకమైన జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటికే 20,31491 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.
జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు జోరందుకున్నాయి.

మరిన్ని వార్తలు