అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న పోలవరం

7 Nov, 2020 10:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా.. ఆ  కుట్రలను అధిగమించి పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సృష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడుతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు చకచకా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలకు మేఘా సంస్థ శక్తి సామర్థ్యాలు తోడు కావడంతో అసాధ్యమల్లా అనతికాలంలోనే సుసాధ్యం కానుంది. ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వే, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. చదవండి: పరుగులు పెడుతున్న పోలవరం పనులు

పోలవరం ప్రపంచంలోనే ఒక బృహత్తర ప్రాజెక్టు. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ లోని ప్రధానమైన స్పిల్ వే డ్యాం, కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్ లో 7లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందివ్వడంతో పాటు తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడంతో పాటు జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం. చదవండి: కేంద్ర కేబినెట్‌ ఆమోదంతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు

అతి పెద్ద ప్రాజెక్టుగా చరిత్రలో... 
2005లో అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పని ప్రారంభమైంది. దాదాపు పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అనుమతులన్నీ ఆయన హయాంలోనే వచ్చాయి. వైఎస్సార్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం కుడి కాలువకి సంబంధించిన ప్రధానమైన పనులన్ని పూర్తి అయ్యాయి. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్ట్ పనులు ముందుకు కదలలేదు. తదనానంతరం రాష్ట్ర విభజన జరగడం, కేంధ్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది.

కానీ 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తన స్వప్రయోజనాల కోసం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును తానే కడతానని కేంద్ర ప్రాజెక్టుని రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చి రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టి కొట్టారు. ఆయన హయాంలో పోలవరం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.  ఈ జాప్యం వలన ప్రాజెక్టు వ్యయం మరింతంగా పెరిగి రాష్ట్రానికి గుదిబండగా మారింది. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలవరం పనులు ముందుకు సాగాలంటే రివర్స్ టెండరింగ్ విధానంతో పాటు ద్వారా రాష్ట్ర ఖజనాకు ఆదాయాన్ని మిగుల్చుతు పోలవరం నిర్మాణ పనుల మహత్తర కార్యాన్ని మేఘా కంపెనీకి అప్పగించారు.

ఈ ప్రాజెక్ట్ లో అన్నీ భారీవే, అరుదైనవే... 
పోలవరంలో అన్నీ అరుదైన, భారీవే. స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో 1.18 కిలోమీటర్ల పొడవైన నిర్మాణం, 55 మీటర్ల ఎత్తుతో 51 బ్లాకులు, నదీ గర్భంలో మూడు (ఈసిఆర్ఎఫ్ గ్యాప్..1,2,3) రాతి, మట్ట కట్ట నిర్మాణాలు, ఈ మూడింటి పొడవు 2.35 కిలోమీటర్లు. ఇవి అరుదైన, అతిపెద్ద నిర్మాణాలు. స్పిల్ వే వైపు అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ఎంత పెద్ద వంటే 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించేలా నిర్మిస్తున్నారు. అప్రోచ్ ఛానెల్ 2.31 కిలోమీటర్ల పొడవు, స్పిల్ ఛానెల్ మరింత పెద్దది. ఇది 1000 మీటర్ల (1 కి.మి) వెడల్పు, 2.94 కిలోమీటర్ల పొడవు, పైలెట్ ఛానెల్ 1000 మీటర్ల వెడల్పు, 1000 మీటర్ల పొడవు.

ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న, ప్రకృతి వైపరిత్యాల వలన తీవ్రమైన వరదలు సంభవించిన మొక్కవోని దీక్షతో పనులు కొనసాగించి పోలవరం ప్రాజెక్టు కి ఒక రూపు తీసుకు వచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అతి కొద్ది సమంలోనే పోలవరం ప్రాజెక్టు యొక్క కాంక్రీట్ పనులను చాలా వరకు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిరూపించారు. 

అధునాతన భారీ రేడియల్ గేట్లు
ప్రపంచంలోనే భారీ వరద నీరు ప్రవహించే విధంగా నిర్మిస్తున్న స్పిల్‌వే లో భారీ గేట్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 48 గేట్లు హైడ్రాలిక్ పద్ధతిలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం ఆగమ్య గోచరంగా ఉండగా, ముఖ్యమంత్రి రంగంలోకి దిగాక అనతికాలంలోనే 28 మీటర్లు ఎత్తుగా ఉన్నా పియర్ పిల్లర్లను 52 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. మొత్తం 192 గడ్డర్స్ పూర్తి చేసి, 84 గడ్డర్లను స్పిల్ వే పై అమర్చడంతో పాటు మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన షట్టరింగ్ పనులను శరవేగంగా చేస్తున్నారు. 

పియర్ పిల్లర్ల పై 250 మీటర్ల పొడవైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణము పూర్తి చేశారు. వీటి తో పాటే ప్రాజెక్ట్ లో కీలకమైన ట్రన్నియన్ బీమ్స్ ని అత్యాధునిక యంత్ర సామగ్రితో అమర్చుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కావాలని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే వారి ఆశలు నెరవేర్చే విధంగా త్వరలోనే పోలవరం ఫలాలు అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఒక యజ్జంలా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్దేశించిన సమయంలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని మేఘా కృత నిశ్చయంతో ఉంది.

మరిన్ని వార్తలు