ఏలూరులో ‘రెమ్‌డెసివిర్‌’ ముఠా గుట్టురట్టు

13 May, 2021 04:39 IST|Sakshi
ఏలూరులో నిందితులను అరెస్టు చూపుతూ వివరాలు వెల్లడిస్తోన్న డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌

10 మంది అరెస్ట్‌.. మరో ముగ్గురి కోసం గాలింపు

13 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, నగదు, బైక్‌లు స్వాధీనం 

ఏలూరు టౌన్‌: ప్రభుత్వాస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు దొంగిలించి.. బయట అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌ నర్సులుగా పనిచేస్తున్న లావణ్య, రాయల వెంకటలక్ష్మితో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 13 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, రూ.40 వేల నగదు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరును కేంద్రంగా చేసుకున్న మూడు ముఠాలు.. కరోనా బాధితులకు అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ నేతృత్వంలో టూటౌన్‌ సీఐ ఆదిప్రసాద్‌ బృందం రంగంలోకి దిగింది.

పక్కా ఆధారాలతో ఏలూరు జీజీహెచ్‌లో పనిచేసే స్టాఫ్‌ నర్సులు లావణ్య, రాయల వెంకటలక్ష్మి, ఎంఎన్‌వో బొమ్మకంటి రవి బ్రహ్మయ్య, గోగులమూడి అశోక్‌తో పాటు ఏలూరు కొత్తపేటకు చెందిన విష్ణుసాయికుమార్, కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రేడియాలజిస్ట్‌ ఏకాంబరేశ్వర అలియాస్‌ బాబి, విజయవాడ సన్‌రైజ్‌ ఆస్పత్రిలోని కార్డియాలజీ టెక్నీషియన్‌ గుమ్మల సాయిబాబు, ఏలూరు సత్రంపాడుకు చెందిన గండేపల్లి సుబ్బారావు, గ్లోబల్‌ మెడికల్స్‌లో పనిచేసే నారాయణ సాయి మోహన్, సూర్య మెడికల్స్‌లో పనిచేసే ముక్కాల సుధీర్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు