బావిలో పడ్డ వృద్ధురాలిని కాపాడిన పోలీసులు

9 May, 2021 08:29 IST|Sakshi
బావిలో పడిన వృద్ధురాలిని బయటకు లాగుతున్న కానిస్టేబుళ్లు శివకుమార్, మహేష్‌  

రేణిగుంట: మండలంలోని అత్తూరు గ్రామ శివారు న ఉన్న వ్యవసాయ బావిలో పడిన ఓ వృద్ధురాలిని గాజులమండ్యం పోలీసులు కాపాడారు. అత్తూరు గ్రామానికి చెందిన సుబ్బమ్మ(80) కాలకృత్యాలు తీర్చుకునేందుకు శనివారం ఉదయం గ్రామ శివారుకు వెళ్లే క్రమంలో పొరపాటున కాలు జారి వ్యవసాయ బావిలో పడి.. మోటారు పైపును పట్టుకుని కేకలు వేసింది. అటుగా వెళుతున్న స్థానికులు గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఎస్‌ఐ శ్రీనివాసులు ఆదేశాలతో కానిస్టేబుళ్లు శివకుమార్, మహేష్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. బావికి మెట్లు లేకపోవడంతో ఆమెను బయటకు తీసేందుకు ఓ మంచానికి తాళ్లు కట్టి బావిలోకి వదిలారు. ఆమె మంచంపైకి చేరుకోవడంతో ఆమెను మెల్లగా గట్టుకు చేర్చారు. దీంతో స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వెంటనే స్పందించి ఈమేరకు కానిస్టేబుళ్లు శివకుమార్, మహేష్‌ను అభినందించి రివార్డు    ప్రకటించారు.

చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: కరోనా చీకట్లో మానవత్వపు చిరు దీపం  
సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం

మరిన్ని వార్తలు