'మేం వాగులో చిక్కుకున్నాం.. కాపాడండి'

19 Sep, 2020 08:37 IST|Sakshi

సాక్షి, కర్నూలు : జిల్లాలోని అలగ వాగులో చిక్కుకున్న ఇద్దరిని పోలీసులు స్థానికుల సహాయంతో శుక్రవారం రాత్రి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వివరాలు.. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన భాస్కర్‌, తేజేశ్వర్‌రెడ్డిలు కారులో మాచర్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామం వద్ద  అలగ వాగు దాటుతూ వరద నీరు ఉధృతం కావడంతో వాగులో చిక్కుకుపోయారు. దీంతో డయల్‌ 100కు కాల్‌ చేసి 'మేము అలగ వాగులో చిక్కుకున్నాం.. దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ పోలీసులకు తెలిపారు.

ఇదే సమయంలో కొందరు స్థానికులు గమనించి వాగులో చిక్కుకున్న ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పాణ్యం సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు, నందివర్గం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి, గోస్పాడు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి , ఇతర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో ఉన్న ఇద్దరిని వాగులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 

మరిన్ని వార్తలు