400 మంది ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు

7 May, 2021 10:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పోలీసులు సకాలంలో స్పందించి 400 మంది ప్రాణాలను కాపాడారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్‌తో  400 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.  ఒడిశా నుంచి బయల్దేరిన ఆక్సిజన్ ట్యాంకర్‌ ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోవడంతో విజయవాడ సిటీ కమిషనర్‌కు అధికారులు సమాచారం అందించారు. వెంటనే ఒరిస్సా నుండి విజయవాడ వరకు మార్గ మధ్యలో ఉన్న జిల్లాల ఎస్పీలను విజయవాడ సీపీ అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలోని ఓ డాబా వద్ద ఆక్సిజన్ ట్యాంకర్‌ను గుర్తించారు.

అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సీఐకి డ్రైవర్‌ వివరించాడు. డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి సీఐ తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్‌ ట్యాంకర్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సకాలంలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను పోలీసులు విజయవాడ జీజీహెచ్‌కు చేర్చడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా కొనసాగింది. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్‌ను తీసుకొచ్చిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.

చదవండి: ఏపీకి 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు
ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం 

మరిన్ని వార్తలు