కైకాల మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

23 Dec, 2022 10:17 IST|Sakshi

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, మంత్రులు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. కైకాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి  తెలిపారు.

‘సార్వ భౌమ’ అనిపించుకున్న మేటి నటుడు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా నవరసనటనా సార్వ భౌమ అనిపించుకున్న మేటి నటుడు కైకాల సత్యనారాయణ మరణం విచారకరమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘‘కైకాల ఆరు దశాబ్దాల సినీ జీవితంలో 777 చిత్రాలలో నటించారు. కేవలం నటుడు గానే కాకుండా చిత్రం నిర్మాణం కూడా చేపట్టి పలు సినిమాలు నిర్మించి మంచి ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ రంగంలో అడుగు పెట్టిన ఆయన మచిలీపట్నం లోక్ సభ నుంచి ఎన్నికై పార్లమెంటు సభ్యుడి గాను తన సేవలను ప్రజలకు అందించారు. సత్యనారాయణ మరణం సినీ రంగానికి తీరని లోటు’’ అని మంత్రి కారుమూరి అన్నారు.

ఇండస్ట్రీకి తీరని లోటు: మంత్రి వేణు
కైకాల మృతి పట్ల మంత్రి వేణుగోపాలకృష్ణ  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 700 చిత్రాలకు పైగా నటించిన కైకాల మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు మంత్రి  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎంతో బాధాకరం: మంత్రి రోజా
సీనియర్‌ నటులు  కైకాల సత్యనారాయణ గారు 750 కిపైగా సినిమాల్లో నటించి `నవరసనటనా సార్వభౌముడు` అనిపించారని మంత్రి రోజా ట్విట్‌ చేశారు. మరణం ఎంతో బాధాకరమని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కైకాల కుటుంసభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు