Vijayawada: గల్ఫ్‌ సర్వీసులకు డిమాండ్‌ ఫుల్‌

21 Dec, 2022 11:01 IST|Sakshi

విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి గల్ఫ్‌ దేశాలకు నడుపుతున్న విమాన సర్వీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను పొందిన ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ సర్వీస్‌లను కూడా విస్తరిస్తోంది. గతంలో గల్ఫ్‌ దేశాలకు రాకపోకలు సాగించేందుకు ఈ ప్రాంత ప్రయాణికులు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాలపై ఆధారపడాల్సి వచ్చేది ఇప్పుడు విజయవాడ విమానాశ్రయం నుంచి షార్జా, మస్కట్, కువైట్‌కు డైరెక్ట్‌ విమాన సరీ్వస్‌లు అందుబాటులోకి రావడంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

రెండు నుంచి ఐదు సర్వీస్‌లకు..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 2018 ఆగస్టు 1న విజయవాడ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. అదే ఏడాది డిసెంబర్‌ నుంచి తొమ్మిది నెలలపాటు సింగపూర్‌–విజయవాడ మధ్య వారానికి రెండు విమాన సర్వీస్‌లు నడిచాయి. ఆ తర్వాత దుబాయ్, అబుదాబికి సర్వీస్‌లు నడపాలని భావించినా కోవిడ్‌ వల్ల సాధ్యం కాలేదు. అప్పట్లో కోవిడ్‌ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ కీలకంగా నిలిచింది.

కోవిడ్‌ తగ్గిన తర్వాత తెలుగువారు ఎక్కువగా ఉండే కువైట్, మస్కట్, యూఏఈలోని షార్జా నుంచి విజయవాడకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఐదు సర్వీస్‌లను నడుపుతోంది. వీటిలో షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు సర్వీస్‌లు, మస్కట్‌కు ఒక సర్వీస్‌ను నడుపుతుంది. కువైట్, మస్కట్‌ నుంచి వారంలో ఒక్కొక్క సర్వీస్‌లు ఇక్కడికి వస్తున్నాయి. ఈ సర్వీసుల్లో నెలకు 4వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 

షార్జా సర్వీస్‌కు విశేష స్పందన.. 
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ నుంచి షార్జా–విజయవాడ మధ్య ప్రారంభమైన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారానికి రెండు రోజులపాటు 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన 737–800 బోయింగ్‌ విమానాన్ని నడుపుతున్నారు. ఈ విమానం షార్జా నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో విజయవాడకు నడుస్తోంది. ఇక్కడి నుంచి షార్జాకు 70శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్‌ యూఏఈలోని షార్జాతోపాటు దుబాయి, అబుదాబికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల యూఏఈ నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు సులువైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.

ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా భవిష్యత్‌లో షార్జా–విజయవాడ మధ్య వారానికి నాలుగు నుంచి ఏడు సర్వీస్‌లకు పెంచేందుకు కూడా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయికి సర్వీస్‌లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు పౌరవిమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నూతనంగా నిరి్మస్తున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిచే అవకాశం ఉంటుంది.  

మరిన్ని వార్తలు