ఆరోగ్య శ్రీ పరిధిలోకి పోస్ట్‌ కోవిడ్‌ చికిత్స 

7 Nov, 2020 03:57 IST|Sakshi

రోజుకు రూ.2,930 చెల్లింపులు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ చికిత్సలను తొలిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి చికిత్సలందించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన ఏపీ.. ఇప్పుడు పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సలనూ(కోవిడ్‌ సోకి కోలుకున్నాక వచ్చే దుష్పరిణామాలు) ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించి ప్రయివేట్‌ ఆస్పత్రులు ఎంత ధరలు వసూలు చేయాలో కూడా స్పష్టం చేశారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించామన్నారు. కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు  సాంత్వన కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి పోస్ట్‌ కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు ఆళ్ల నాని పేర్కొన్నారు.  

ధరలు ఇలా ఉన్నాయి
► ఆక్సిజన్, సీపాప్, బైపాప్‌తో చికిత్స అందిస్తూ.. ఐసొలేషన్‌ వార్డు/ఐసీయూ రెంటు, అడ్మిని్రస్టేటివ్‌ చార్జీలు, నర్సింగ్, పర్యవేక్షణలన్నీ కలిపి రోజుకు రూ.900 
► కన్సల్టేషన్‌ చార్జీల కింద రూ.400 
► మందులు, నిర్ధారణ పరీక్షలకు రూ.700 
► ఆక్సిజన్, నెబులైజేషన్‌ చార్జీలు రూ.500 
► పోషకాహారానికి రూ.200 
► వైరస్‌ సోకకుండా డిస్‌ ఇన్ఫెక్షన్‌ చేసేందుకు రూ.230 
► రోజుకు రూ.2,930 వరకూ చెల్లిస్తారు.   

మరిన్ని వార్తలు