సాక్షి, అనంతపురం : తమ కుమారుడి మృతిపై చాలా అనుమానాలున్నాయని కెనడాలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు యువకుడు ప్రణయ్ తండ్రి నారాయణ స్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో అఖిల తన కొడుకును మోసగించిందని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పెళ్లి ఇప్పుడే వద్దంటూ మాయ చేసిందని, అఖిల, ఆమె తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు యువతి కుటుంబంపై న్యాయ పోరాటానికి దిగుతామని చెప్పారు.
కాగా, ప్రేమించిన యువతి చేసిన మోసాన్ని తట్టుకోలేక కెనడాలో అనంతపురానికి చెందిన తెలుగు యువకుడు ప్రణయ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతడు నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రాణం తీసుకున్నాడు. ప్రేయసి తనను మోసం చేసిన వైనాన్ని వీడియో తీసి యూట్యూబ్లో ఉంచాడు. ఆమె తనకంటే ముందు మరో ఆరుగురిని మోసం చేసిందని వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్లో చివరి కోరిక కోరాడు. తన బాడీని పరిశోధనలకు వాడేలా చూడాలని తల్లిదండ్రులకు లేఖ రాశాడు.