గ్రామంలోకి నో ఎంట్రీ.. అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం

10 May, 2021 19:41 IST|Sakshi
అంబులెన్స్‌లో బిడ్డతో పాంగి లలిత

సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్‌ భయం మనుషుల్లో విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. ప్రాణ భయంతో మంచి,చెడులు మరిచిపోతున్నారు జనం. ప్రాణం మీదకు వచ్చినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. పురుటి నొప్పులతో అల్లాడుతున్న ఓ గర్భిణి కోసం వచ్చిన అంబులెన్స్‌ను సైతం ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. వివరాలు.. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం పాల మామిడి గ్రామస్తులు.. గ్రామంలోకి వేరే వాళ్లు రాకుండా సరిహద్దు వద్ద గేట్‌ ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పాంగి లలిత అనే మహిళకు పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు కోరిన మేరకు అంబులెన్సు వచ్చింది. కానీ, గ్రామస్తులు గ్రామంలోకి అంబులెన్స్‌ను అనుమతించలేదు. దీంతో ఆ గర్భిణిని నడిపించుకుంటూ గ్రామ శివారులోని అంబులెన్స్ ఎక్కించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లేలోగా లలిత బాబుకు జన్మనిచ్చింది. ప్రజలు కరోనా భయంతో అంబులెన్స్‌ను గ్రామంలోకి అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు