పెళ్లికి ముందే గర్భం.. భర్తకు ఫోన్‌ చేసి...

6 Oct, 2021 13:10 IST|Sakshi
పుష్పావతి (ఫైల్‌) 

గాలింపు చేపట్టిన ఎస్‌ఐ, తహసీల్దార్లు

సాక్షి, గాలివీడు : వైఎస్సార్‌ వెలిగల్లు ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నిండు గర్భిణి తన భర్తకు ఫోన్‌ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా... చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టనం నీరుగుట్టపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె పుష్పావతి(21), గాలివీడు మండలం అరవీడుకు చెందిన పుర్రం మారుతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే పుష్పావతి గర్భం దాల్చింది. ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అప్పటికే పుష్పావతి ఏడు నెలల గర్భవతి.

చదవండి: (భర్త మరణవార్త విని భార్య మృతి)

సెప్టెంబర్‌లో అత్తవారింటి వద్ద ఉన్న పుష్పావతికి సంప్రదాయబద్ధంగా ఆమె తల్లిదండ్రులు పుసుపు, కుంకుమ ఇచ్చి కాన్పు కోసం మదనపల్లెకు తీసుకెళ్లారు. మంగళవారం పుష్పావతి మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులో గాలివీడుకు చేరుకుంది. సమీపంలోని వైఎస్సార్‌ వెలిగల్లు ప్రాజెక్టు వద్ద నుంచి భర్తకు ఫోన్‌ చేసి ప్రాజెక్టులోకి దూకుతున్నానని సమాచారాన్ని చేరవేసింది. భర్త మారుతి హుటాహుటిన వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. ప్రాజెక్టు వద్ద భార్య చెప్పుల(పాదరక్షలు)ను గమనించి ఎస్‌ఐ చిన్నపెద్దయ్య, తహసీల్దార్‌ శ్రావణికి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించన ఎస్‌ఐ, తహసీల్దార్‌ గాలింపు చేపట్టారు. ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎక్కడికైనా వెళ్లిందా అనే కోణంలో పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను, అధికారులను ఆదేశించారు.

చదవండి: (వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి)

మరిన్ని వార్తలు