YSR Pension Kanuka: 5 రోజుల పాటు పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

31 Dec, 2021 05:38 IST|Sakshi

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి సర్వం సిద్ధం 

జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి లబ్ధి  

రూ.1,570.60 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 

జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు

సాక్షి, అమరావతి : జనవరి 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తోంది. శనివారం నుంచి లబ్ధిదారులకు పెన్షన్‌ మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచి చెల్లించబోతోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అవ్వాతాతలకు చెల్లిస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతామని వైఎస్‌ జగన్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ మేరకు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం.. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పెన్షన్ల పెంపుదల ఫైల్‌పై  తొలి సంతకం చేశారు. పెన్షన్‌ మొత్తాన్ని రూ.3 వేల వరకు పెంచుతామన్న మాటకు కట్టుబడి పింఛన్‌ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా పాల్గొని పెన్షన్‌ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవుతారు. 

రూ.45 వేల కోట్లు ఖర్చు  
► రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తోంది.  ఇందుకోసం ఇప్పటికే రూ.1,570.60 కోట్లు విడుదల చేసింది. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసింది. వీరందరికీ శనివారం నుంచి పెంచిన మొత్తాలతో పెన్షన్‌ చెల్లింపులు చేయనున్నారు.

► వైఎస్‌ జగన్‌ సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పెన్షన్లకు రూ.45 వేల కోట్లు ఖర్చు చేశారు. 24 కేటగిరిల కింద పెన్షన్లను ప్రతినెలా 1వ తేదీనే లబ్ధిదారుల చేతికి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

► 2.66 లక్షల మంది వలంటీర్లు పెన్షన్ల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రతినెలా ఒకటో తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, వారి చేతికే పెన్షన్‌ సొమ్మును అందిస్తున్న ప్రక్రియ లేదు.

► దీర్ఘకాలిక వ్యాధులు, గుర్తించిన అనారోగ్యాలతో బాధ పడుతున్న వారికి కూడా ప్రభుత్వం మెడికల్‌ పెన్షన్లు అందిస్తోంది. సీఎం జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 18.36 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారు.

పెన్షన్లలో మనమే ఎక్కువ 
దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నది మన రాష్ట్రమే. ప్రతినెలా సుమారు 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నాం. ఇందుకు ప్రతి నెలా సుమారు రూ.1,450 కోట్లకు పైగా కేటాయిస్తున్నాం. ప్రతి ఏటా దాదాపు రూ.18 వేల కోట్ల మేరకు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జనవరి నుంచి పెరిగిన పెన్షన్లతో ప్రతి ఏటా పెన్షన్ల కోసం చేసే ఖర్చు రూ.20 వేల కోట్లకు చేరుతోంది.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి   

మరిన్ని వార్తలు