కొత్త ఇసుక పాలసీతో ప్రజలకు లబ్ధి: గోపాలకృష్ణ ద్వివేది

22 Mar, 2021 18:29 IST|Sakshi

ఇసుక టెండర్‌ పూర్తి పారదర్శకంగా జరిగింది : ద్వివేది

అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర..నాణ్యతను బట్టి ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు

సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.  సోమవారం విలేకరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇసుక టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ కొత్త పాలసీ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పాలసీలో మార్పులు చేసి నూతన ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. 

నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్‌ వద్ద 20 వాహనాలు ఏర్పాటు చేసిట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రీచ్‌ల్లోనూ  ధరను  ముందే నిర్ణయిస్తున్నామని,  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగదారులు నేరుగా వచ్చి వారి సొంత వాహనాల్లో ఇసుకను తీసుకెళ్లొచ్చని, నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు ఉందని వివరించారు. 

ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. 'ఇసుక తవ్వకాలు, రీచ్ల నిర్వహణ, అమ్మకాలకు సంబంధించి టెండర్‌లను ఆహ్వానించాం. ఎవ్వరైనా పాల్గొనేందుకు వారం రోజులు అదనపు సమయం కూడా ఇచ్చాం. పూర్తి  పారదర్శకంగా టెండర్లను నిర్వహించాం. ఇందులో భాగంగానే  జనవరి 4న ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ సంస్థ టెండర్ల విధానంలో  ఎంతో అనుభవం ఉన్న ఏజెన్సీ. మూడు ప్యాకేజీల కు కచ్చితంగా నిబంధనలు పెట్టాం.

 సాంకేతిక, ఆర్థిక అర్హతలు అన్ని ముందే పరిశీలించాం. ఏడాదికి సుమారు వెయ్యి కోట్లు ఇసుకను సరఫరా చెయ్యగలరు. ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి టెండర్ సంస్థ డబ్బులు చెల్లించాలి. 70 శాతం రీచ్ లు ఖచ్చితంగా నిరంతరం అందుబాటులో ఉండాలి. ఇసుక కొరత సృష్టించడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించాం. వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చెయ్యలేరు. ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక 475 ధర ను ఖరారు చేశాం. దానికి అదనంగా రవాణా ఛార్జీల ఉంటాయి' అని స్పష్టం చేశారు. 

చదవండి : 
విశాఖలో బీఎస్‌–6 ఇంధన ఉత్పత్తి

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి

మరిన్ని వార్తలు