సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి మండలం నిమ్మాడలో తమకు ప్రత్యర్థిగా పోటీ చేసిన కింజరాపు అప్పన్నపై దాడి చేసిన ఘటనలో అరెస్టయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు 14 రోజుల రిమాండ్ ఖైదీగా శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ నంబర్ 8775గా ఉన్నారు. జైలు జీవితం రెండు రోజులు గడిచింది. తొలి రోజైన మంగళవారం సాయంత్రం మూడు చపాతీలు, చిక్కుడుకాయల కూర తిని, రాత్రి 9.30 గంటలకు నిద్రపోయారు.
బుధవారం ఉదయం 5.30కి నిద్రలేచి టీ తీసుకున్నారు. జైలు సిబ్బంది తీసుకొచ్చిన సాక్షి, మరో పత్రికను చదివారు. ఉదయం 8.30కి పొంగలి తీసుకున్నారు. రిమాండ్ ఖైదీగా వచ్చినప్పుడు తీసుకెళ్లిన డ్రస్ను బుధవారం మార్చుకున్నారు. ఎవర్నీ కలవనియ్యవద్దని ఆయన సిబ్బందితో చెప్పారు. గురు, శుక్రవారాల్లో లోకేశ్, మరికొందరు అచ్చెన్నాయుడిని కలిసే అవకాశముందని పోలీసులకు సమాచారం వచ్చింది. చదవండి: ('అందర్నీ గుర్తు పెట్టుకుంటా.. సంగతి తేలుస్తా’)