ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రి దందా

24 Aug, 2020 05:40 IST|Sakshi
ఏలూరులోని మురళీకృష్ణ హాస్పిటల్‌

ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి అనధికారికంగా కోవిడ్‌ బాధితులకు వైద్య చికిత్సలు చేస్తూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఆసుపత్రిని శనివారం సీజ్‌ చేశారు. వివరాలలోకి వెళితే..  

► ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ సమీపంలో డాక్టర్‌ బొర్రా మురళీకృష్ణ గత కొంత కాలంగా ‘మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ అండ్‌ ఎమర్జెన్సీ హాస్పిటల్‌’ను నిర్వహిస్తున్నారు.  
► ఈ హాస్పిటల్‌కు ఆరోగ్యశ్రీ అనుమతులు ఉండగా గత నెలలో కోవిడ్‌ హాస్పిటల్‌గా అనుమతులు ఇవ్వాలంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.  
► ఈ నెల 21న ఆసుపత్రిని పరిశీలించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సునంద, మరికొందరు వైద్యాధికారులు వెళ్లారు.
► పరిశీలనకు వెళ్లిన అధికారులకు విస్తుబోయే విషయాలు తెలిశాయి. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాకుండానే డాక్టర్‌ మురళీకృష్ణ తన హాస్పిటల్‌లో పెద్ద ఎత్తున కరోనా చికిత్సలు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.  
► కరోనా బాధితుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు రోగుల బంధువులు అధికారులకు చెప్పారు. రూ.10 లక్షల విలువైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు.  
► ప్రస్తుతం 20 మంది కరోనా రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. వైద్యం వికటించి కొందరు మృతిచెందినట్లుగా కూడా తెలుస్తోంది. 
► తనిఖీలకు సంబంధించిన విషయాలను వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించామని డాక్టర్‌ సునంద తెలిపారు. 

మరిన్ని వార్తలు