తెలుగు ప్రొఫెసర్‌కు అరుదైన ఘనత

28 Jun, 2022 14:18 IST|Sakshi
డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి

ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో ఆచార్య బుసిరెడ్డి

జాతీయస్థాయిలో 972వ ర్యాంకు

వెవీయూ: వైఎస్సార్‌ జిల్లా కడప నగరం ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో చేరారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఉత్తమ పరిశోధనలను పరిశీలించి ర్యాంకింగ్‌ కేటాయించే ఏడీ (అల్ఫర్‌–డోగర్‌) సైంటిఫిక్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ పరిశోధకుల జాబితాలో ఆచార్య బుసిరెడ్డికి చోటు దక్కింది. తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో ఆయన అంతర్జాతీయ స్థాయిలో 19,034వ ర్యాంకు, ఆసియా స్థాయిలో 4,302వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 972వ ర్యాంకు, కళాశాల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. 

ఎస్‌సీఐ పరిశోధనా పత్రాలు, స్కోపస్‌ హెచ్‌–ఇండెక్స్, ఐ–10 ఇండెక్స్, సైటేషన్స్, ఓఆర్‌సీఐడీ, వెబ్‌ ఆఫ్‌ సైన్స్, విద్యాస్, గూగుల్‌ స్కారల్‌ డేటాబేస్‌ ఆధారంగా ఈ ర్యాంకులను సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.రవీంద్రనాథ్, అధ్యాపక బృందం ఆయనకు అభినందనలు తెలిపారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామానికి చెందిన డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డికి ఇప్పటికే పలు పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాయి. గతంలో సౌత్‌కొరియా, స్వీడన్, ఫిన్‌ల్యాండ్, హాంకాంగ్, సౌత్‌ ఆఫ్రికా తదితర దేశాల్లో విజిటింగ్‌ సైంటిస్ట్‌గా సేవలందించారు. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. (క్లిక్: పాఠాలకు పక్కా క్యాలెండర్‌)

మరిన్ని వార్తలు