నింగికెగిసిన పీఎస్‌ఎల్వీ సీ-50 రాకెట్‌

17 Dec, 2020 18:34 IST|Sakshi

సాక్షి, సూళ్లూరుపేట: శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్‌-01 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు సీఎంఎస్‌-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్‌-12 స్థానాన్ని  సీఎంఎస్‌-01 శాటిలైట్‌ భర్తీ చేయనుంది. సీఎంఎస్‌ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్)

ఇస్రో చైర్మన్‌ హర్షం..
పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ హర్షం వ్యక‍్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాటిలైట్‌ అద్భుతంగా పని చేస్తోందని, నాలుగు రోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామని శివన్‌ పేర్కొన్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేగనిగా మారింది. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీ్వకే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్‌ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్‌ వేదికైంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్‌)

పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను  ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు స్ట్రాఫాన్‌ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీన్ని కోర్‌ అలోన్‌ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు.

ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లాలంటే అత్యంత శక్తివంతమైన స్ట్రాపాన్‌ బూస్టర్లతో చేస్తారు. ఈ తరహా ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్లతో ఇప్పటికి 21 ప్రయోగాలు చేశారు. 
ఇటీవలి కాలంలో రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్‌ఎల్వీ – క్యూఎల్, నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్‌ఎల్వీ – డీఎల్‌ అనే పేర్లతో చేస్తున్నారు.

వీటి ద్వారా కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు, రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు (దూర పరిశీలన ఉపగ్రహాలు), చంద్రయాన్‌ ∙1, మంగళ్‌యాన్‌ – 1 లాంటి గ్రహాంతర ప్రయోగాలు, భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో పీఎస్‌ఎల్వీ అగ్రగామిగా ఉంది. 
ఎక్కువ ఉపగ్రహాలను మోసుకెళ్లి సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో వివిధ రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండే రాకెట్‌ కూడా ఇదే కావడం గమనార్హం.

ఓకే ఆర్బిట్‌.. ఎనిమిది రకాల కక్ష్యలు
ఒకే ఆర్బిట్‌లో ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించి ఎక్కువ ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఘనత పీఎస్‌ఎలీ్వదే. గతేడాది జనవరి 24న పీఎస్‌ఎల్వీ సీ – 44 రాకెట్‌లో నాలుగో దశను ప్రయోగాత్మకంగా చేసి రెండు రకాల కక్ష్యల్లో మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగమిచ్చిన విజయంతో ఏప్రిల్‌ 1న  పీఎస్‌ఎల్వీ సీ – 45  ప్రయోగంలో నాలుగోదశ  (పీఎస్‌ – 4) ద్వారా  మూడు రకాల కక్ష్యల్లో 29 ఉపగ్రహాలను విడివిడిగా ప్రవేశపెట్టగలిగారు. 

జనవరి 24న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ – 44 ద్వారా పీఎస్‌ – 4 దశలో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోనే ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించింది. 

భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపగ్రహాలను భూమికి 800 కిలోమీటర్ల ఎత్తు నుంచి 504 కిలోమీటర్లు తగ్గించుకుంటూ వస్తే 8 రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే వీలుంటుందని గుర్తించింది పీఎస్‌ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. పీఎస్‌ఎల్వీ సీ – 45లోని పీఎస్‌ – 4 దశ ముందుగా 753 కిలోమీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ఈఎంఐ శాట్‌ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాక పీఎస్‌ – 4 దశను మండించి మళ్లీ కిందికి తీసుకొచ్చి 508 కిలోమీటర్ల ఎత్తులో కొన్ని ఉపగ్రహాలు, 505 కిలోమీటర్ల ఎత్తులో మరికొన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించింది కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్టే కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు