కౌంట్డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌకకు బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్డౌన్ను లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం మిషన్ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రయోగానికి 25 గంటల కౌంట్డౌన్ను ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ ఎత్తులో, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని దీర్ఘ వృత్తాకార జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశ పెట్టనున్నారు.
ప్రయోగం విజయవంతం కావాలని..
పీఎస్ఎల్వీ–సీ50 ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో డిప్యూటీ సెక్రటరీ లక్ష్మణ్ బుధవారం తిరుమల,శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. పీఎస్ఎల్వీ–సీ50 నమూనాను శ్రీవారి పాదాల చెంత, శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
నింగివైపు దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌక