పులివెందుల ఎస్‌ఐ సాహసం

29 Aug, 2020 09:54 IST|Sakshi

సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల ఎస్‌ఐ విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా పట్టుకున్నారు. పులివెందులలోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆపిఉన్న ఓ వాహనంలో అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాహనంలో ఉన్నవారు కారును ముందుకు, వెనక్కి నడుపుతూ వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. 

ఈ నేపథ్యంలో ఎస్‌ఐ కారు పైకి ఎక్కి గట్టిగా పట్టుకునేందుకు యత్నించినా, కారులో ఉన్న దుండగులు మాత్రం  ఆగకుండా రెండు కిలోమీటర్లు వరకూ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అయినా ఎస్‌ఐ గోపీనాథ్‌ రెడ్డి ఏమాత్రం పట్టు సడలకుండా కారు ముందు భాగంవైపు అద్దాన్ని పట్టుకునే ఉన్నారు. మరోవైపు ఇంకో పోలీసు వాహనంలో అక్కడకు చేరుకున్న సిబ్బంది మద్యం ముఠాను అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై ఎస్‌ఐ ధైర్యానికి ప్రశంసలు కురుస్తున్నాయి.  దుండగుల్ని అదుపులోకి తీసుకుని, 80 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

మరిన్ని వార్తలు