నేడు పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

26 Oct, 2020 07:48 IST|Sakshi

సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతి రాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తొలిసారి పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా నేపధ్యంలో ప్రజలంతా ఆరోగ్యం, సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను' అని సంచయిత తెలిపారు.

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల్లో భాగంగా సోమవారం తోలేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకుగానూ ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాగా.. అమ్మవారి దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్ల విధానం తీసుకురాగా.. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన వారికి మాత్రమే అమ్మవారి దర్శనాలు కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.   (కర్రల సమరంపై ఉత్కంఠ; పలుప్రాంతాల్లో 144 సెక్షన్‌) 

అయితే ఇప్పటికే అమ్మవారి దర్శనం కోసం భక్తులు తీరారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు నగరంలో పలు ఆంక్షలు విధించారు. సోమ, మంగళవారాల్లో లాక్‌డౌన్‌ను విధించగా.. ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి నగరంలోకి ప్రవేశం లేదు. వారిని జిల్లా సరిహద్దుల్లోనే పోలీసులు నిలువరిస్తున్నారు. నగరంలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పోలీసులకు  సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు