సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణరాజు

17 May, 2021 15:57 IST|Sakshi

రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశం

సాక్షి, ఢిల్లీ: రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగానే రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడీషియల్‌ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలని పేర్కొంది. వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్‌ దుష్యంత్‌ దవే తెలిపారు. సీనియర్‌ జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు సిద్ధమని పేర్కొన్నారు.

సమీపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.మీ. దూరంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.మీ దూరంలో ఉందని లాయర్‌ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితులున్నాయని.. కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్‌ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్‌ దవే వివరించారు. రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. వాదనలు శుక్రవారం వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.

చదవండి: అసలు కుట్ర బయటపడకుండా పక్కదోవ పట్టించేందుకే?!
ఒంటిపై గాయాలేవీ లేవు

మరిన్ని వార్తలు