హైదరాబాద్‌కు రఘురామకృష్ణరాజు

17 May, 2021 18:52 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన్ని సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. కాగా, రఘురామకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగానే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడీషియల్‌ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

 జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలని పేర్కొంది. వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రఘురామను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు