‘మేరీ సహేలీ’తో మహిళా ప్రయాణికులకు రక్ష

18 Oct, 2020 05:22 IST|Sakshi
రైలులో ప్రయాణికురాలికి ‘మేరీ సహేలీ’ వివరాలు తెలియజేస్తున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర):  రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతే ముఖ్య ఉద్దేశంగా మేరీ సహేలీ(మై ఫ్రెండ్‌) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్‌) అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం విశాఖ రైల్వే స్టేషన్‌లో సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ జితేంద్ర శ్రీవాస్తవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్, ఏపీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్ల వద్ద మహిళా ప్రయాణికులకు ఆర్పీఎఫ్‌ సిబ్బంది అవగాహన కల్పించారు.  

భద్రత ఇలా: ఆర్పీఎఫ్‌ సిబ్బంది ముందుగా మహిళా ప్రయాణికుల సీటు, బెర్త్, కోచ్‌ నంబర్లు  తదితర సమాచారం సేకరించి వారిని అప్రమత్తం చేస్తారు. ఇదే సమాచారాన్ని ఆ రైలు ప్రయాణించే అన్ని స్టేషన్లలోని ఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఆందజేస్తారు. ఆ రైలు ఆ స్టేషన్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఉన్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రయాణికుల వద్దకు వెళ్తారు. వారి స్థితిని తెలుసుకుంటారు. ఇలా ఆ రైలు గమ్యం చేరే వరకు ప్రతి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బంది వారిని అనుసరిస్తుంటారు. అత్యవసరమైతే ఉచిత హెల్ప్‌లైన్‌ 182 నంబర్‌లో సంప్రదించాలని ప్రయాణికులకు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు