Weather Alert: బలపడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం.. రాష్ట్రంపై ‍ప్రభావం ఎంతంటే?

22 Dec, 2022 14:56 IST|Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం­: తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకు­ని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఆ వాయు­గుండం పశ్చి­మ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమ­రిన్‌ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావర­ణ విభాగం (ఐఎండీ) బుధవా­రం తెలిపింది. దీని ప్రభావం ఏపీపై నామమాత్రంగానే ఉండనుంది.

మరో­­వైపు రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నే­య గాలులు వీస్తున్నా­యి. వీటి ఫలితంగా రాష్ట్రంలో పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడంతో చలి ప్రభా­వం అధికంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద­యం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రం­లో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉం­ద­ని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వా­తావరణం ఉంటుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు