ఏపీ: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తా, సీమలో వర్షాలు 

16 Nov, 2022 05:00 IST|Sakshi

18 నాటికి వాయుగుండంగా మారే అవకాశం 

దక్షిణ కోస్తా, రాయలసీమలో మళ్లీ వర్షాలకు ఆస్కారం 

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం అండమాన్‌కు ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 18 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.

ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.  

మరిన్ని వార్తలు