అకాల వానలతో పాటు పిడుగులు.. ఆ సమయాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

8 May, 2022 16:19 IST|Sakshi

వేసవే అయినా మబ్బులు భయపెడుతున్నాయి. అకాల వానలతో పాటు పిడుగులు ప్రాణాలను బలికొంటున్నాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు, వాతావరణ వేత్తలు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో బయట పనులకు వెళ్లేవారు, పొలంలో పనిచేసే రైతులు, ఉపాధి వేతనదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఏం చేయకూడదు..? 
►జోరు వాన కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదు. 
►ఉరుములు, మెరుపుల సమయాల్లో పొలాల్లో ఉండకూడదు. 
►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లే దా అంతకంటే తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలో పిడుగుపడే అవకాశముంది. 
►మెరుపు కనపడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లకపోవడం మేలు. 
►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్‌ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్‌ ఉంటే స్విచ్‌ ఆఫ్‌ చేయడం మంచిది. 
►వర్షం పడే సమయంలో విద్యుత్‌ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో ఉండరాదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. 
►గుండె సంబంధిత వ్యా«ధులు ఉన్నవారు మె రుపులు, ఉరుములతో భయాందోళనకు గురవుతారు. ఇలాంటి వారు ఇళ్లలో ఉండడం మేలు.

ఇలా చేయండి...
ఆమదాలవలస: పిడుగు పాటుపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమదాలవలస డాట్‌ సెంటర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జె.జగన్నాథరావు సూ చించారు. మేఘం నల్లబడే సమయంలో పొలాల్లో, ఆరుబయట ఎవరూ ఉండకూడదని వెంటనే దగ్గరలో ఉన్న షెల్టర్‌లోకి చేరుకోవాలని సూచించారు. ము ఖ్యంగా భారీ చెట్లు, తాటిచెట్టు, ఈత చెట్టు వంటి వాటి కిందకు వెళ్లకూడదన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో గొడుగు కూడా వేసుకొని బహిరంగ ప్ర దేశాల్లోకి వెళ్తే వారిపై పిడుగు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. గ త్యంతరం లేని పరిస్థితుల్లో పొలంలో ఉండిపోతే వెంటే ఎలాంటి చెట్లు లేని దగ్గర కాళ్ల ముడుకులు గుండె భాగానికి తగిలేలా కూర్చుని, చెవులు రెండు చేతులతో మూసుకొని కూర్చుంటే 80 శాతం  రక్షణ పొందవచ్చునని తెలిపారు.

ప్రథమ చికిత్స చేయాలి 
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను ఒక అడుగు పైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. 
– యండ భవ్యశ్రీ, వైద్యాధికారి, సరుబుజ్జిలి  

చదవండి: ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా!

మరిన్ని వార్తలు