రమేష్‌ ఆస్పత్రిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు

14 Aug, 2020 18:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స‌్వ‌ర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంతో ప‌ది మంది రోగుల ప్రాణాలు కోల్పోవ‌డానికి కార‌ణ‌మైన ర‌మేష్ ఆస్ప‌త్రిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌భుత్వ నిబంధనలకు‌ విరుద్దంగా కోవిడ్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు శుక్ర‌వారం కమిటీ నివేదిక వెల్ల‌డించింది. దీంతో ర‌మేష్ ఆస్ప‌త్రికి అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజ‌య‌వాడ ఎంజీ రోడ్‌లోని డాక్ట‌ర్ ర‌మేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్  ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ప‌త్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందిన‌ట్లు గుర్తించారు. (మోసమే మార్గం.. దోపిడీయే లక్ష్యం)

ర‌మేష్ ఆస్ప‌త్రి నియంత్రణలో ఉన్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆగ‌స్టు 8న‌ అగ్ని ప్రమాదం సంభవించిన విష‌యం తెలిసిందే. ఈ కేసు విచార‌ణ‌లో నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్‌ను పెట్టిన‌ట్లు తేలింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని వెల్ల‌డైంది. అంతేకాక ఆసుపత్రిలో చేరిన రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేశారని నివేదిక పేర్కొంది. దీంతో కోవిడ్ కేర్‌ సెంటర్‌గా రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేశామ‌ని క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ వెల్ల‌డించారు. క‌రోనా పాజిటివ్ రోగుల‌ను చేర్చుకోవద్దని రమేష్ ఆసుపత్రిని ఆదేశించారు. ఈ మేర‌కు జారీ చేసిన ఉత్త‌ర్వులు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. (మంటలు తీవ్రమైన తర్వాతే సమాచారం ఇచ్చారా?)

మరిన్ని వార్తలు