ఏది నిజం?: తప్పు బాబుదైనా... నెట్టేస్తే సరి!! 

21 Sep, 2022 07:24 IST|Sakshi

పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన ప్రధాని మోదీ

2019 మే 30న సీఎంగా జగన్‌ ప్రమాణం; జూన్‌ 14కే వరదలు

ఆ 14 రోజుల్లో కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేయకపోవటం వైఫల్యమా?

ఒకవేళ వీటి గ్యాప్‌లు పూడ్చేసి ఉంటే కొట్టుకుపోయి ఉండేవి కావా?

 ఐఐటీ బృందం తప్పుబట్టింది అప్పటిదాకా పాలించిన బాబుని కదా?∙

‘పాలకులు’ అనే పదాన్ని పట్టుకుని దాన్ని జగన్‌పైకి నెట్టేస్తున్న ‘ఈనాడు’

∙ చంద్రబాబును ఈ స్థాయిలో వెనకేసుకు రావటంపై నిపుణుల విస్మయం

సిగ్గూఎగ్గూ.. ఉచ్చంనీచం అన్నీ వదిలేసి రాసే రాతలెలా ఉంటాయో... ‘ఈనాడు’ను చూస్తే అర్థమవుతుంది. 2019 మేలో ఎగువ కాఫర్‌డ్యామ్‌లో ఉంచిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవటంవల్లే  ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్దపెద్ద గుంతలు పడ్డాయని, నదీగర్భం కోతకు గురైందని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందం చెప్పిందనేది రామోజీరావు మాట. ఇదంతా పాలకుల ప్రణాళిక లోపమేనని, వారి వైఫల్యమేనంటూ రామోజీ రెచ్చిపోయారు. అసలు ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిందెప్పుడు?  2019 మే 30న కదా? ఆ ఏడాది జూన్‌ 14 నుంచే ఊహించని రీతిలో రాష్ట్రానికి వరదలొచ్చాయి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో గ్యాప్‌ల గుండా నీటి ప్రవాహం పెరిగి ప్రధాన డ్యామ్‌ నిర్మించే చోట పునాది (డయాఫ్రమ్‌ వాల్‌) దెబ్బతింది. పెద్దపెద్ద గోతులు పడ్డాయి.

మరి ఆ వైఫల్యం అధికారంలో ఉండి ఐదేళ్లూ ఆ పని చేయని చంద్రబాబుదా? లేక 15 రోజుల్లో చేయలేకపోయిన వై.ఎస్‌.జగన్‌దా? ఎవరి పాపాలు ఎవరికి అంటగట్టాలని చూస్తున్నారు రామోజీరావు గారూ? 

పోలవరాన్ని ప్రాజెక్టులా కాకుండా చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం పచ్చి నిజం. చంద్రబాబు దీన్ని పద్ధతి ప్రకారం కట్టకుండా కమీషన్లు వచ్చే పనులే ముందు చేశారన్నది కాదనలేని నిజం. ఈ ప్రాజెక్టులో ఏకంగా రూ.3,302 కోట్ల విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో రామోజీ వియ్యంకులకు చెందిన నవయుగకు కట్టబెట్టడం తిరుగులేని నిజం. అది కూడా ఈపీసీ పద్ధతి కాకుండా లంప్సమ్‌ (ఎల్‌ఎస్‌) విధానంలో!!. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదే అతిపెద్ద స్కామ్‌ కూడా. ఈ నిజాలు చెప్పకుండా పదేపదే అర్ధసత్యాలు, అసత్యాలు రాయాలని.. వారంలో ఒకసారైనా పోలవరంపై కథనం రాసి తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని రామోజీరావు తనవారికి హుకుం జారీ చేయటం పచ్చి నిజం. అంతేకాదు!! అసెంబ్లీ సాక్షిగా బాబు–రామోజీల దోచుకో–పంచుకో–తినుకో (డీపీటీ) విధానాన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చి వాస్తవాలు. మంగళవారం ‘నిపుణుల మాట వేరు’ అంటూ ‘ఈనాడు’ అచ్చేసిన వార్తలో అసత్యాలు ఒక్కొక్కటీ చూద్దాం... 

భారీ కోత... బాబు అవివేకం వల్ల కాదా? 

ఈనాడు: పోలవరం ప్రాజెక్టులో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందు కేంద్ర జలసంఘం, కేంద్రం నియమించిన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అనుమతులు తీసుకోవాలి. డమాఫ్రమ్‌ వాల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులు ప్రారంభించే క్రమంలో ముందే ఆ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు.  

వాస్తవం: గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేశాక.. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఇవి జరిగాక.. ఒకే సీజన్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు పూర్తి చేయాలనే షరతుతో కేంద్ర జలసంఘం 2018లో అనుమతి ఇచి్చంది. కానీ చంద్రబాబు ఈ అనుమతులకు ముందే అంటే... 2017 జూన్‌ 8నే ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు టెంకాయ కొట్టేశారు. 2018లో వరదలు తగ్గాక ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు ప్రారంభించారు. కానీ.. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపైగానీ.. అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లను పూర్తి చేయడం గానీ ఏమాత్రం చేయలేదు.

ఇదే అంశంపై నిర్వాసితులు కేంద్ర జల్‌ శక్తి శాఖకు, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి (పీపీఏ) ఫిర్యాదు కూడా చేశారు. దాంతో.. నిర్వాసితులకు పునరావాసం  కల్పించాలని, తాము విధించిన నిబంధనల మేరకు పనులు చేయాలని మరోసారి నాటి టీడీపీ సర్కార్‌ను కేంద్ర జల్‌ శక్తి శాఖ, పీపీఏ ఆదేశించాయి. వాటిని చేయలేక మధ్యలోనే చంద్రబాబు చేతులెత్తేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఒక చోట 380 మీటర్ల మేర, మరో చోట 300 మీటర్ల గ్యాప్‌లు వదిలేశారు. 2019 జూన్‌ మధ్య నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఆ సీజన్లో భారీ వరదొచ్చింది. అది 2.1 కిలో మీటర్ల వెడల్పున ప్రవహించాలి. కానీ ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో వదిలిన ఖాళీలు... అంటే 680 మీటర్ల వెడల్పునే ప్రవహించాల్సి వచ్చింది. దాంతో ఉద్ధృతి ఎక్కువై ఇసుక కోతకు గురైంది. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే అంశాన్ని శాసనసభలో సీఎం చెప్పారు. దీన్ని వివరించి... తప్పు ఎవరిదని ఏ సామాన్యుడిని ప్రశ్నించినా.. చంద్రబాబుదేనని ఠక్కున సమాధానం చెబుతారు. ఒక్క రామోజీ తప్ప. 

గ్యాప్‌లు పూడిస్తే కాఫర్‌ డ్యామ్‌లు కొట్టుకుపోవా?

ఈనాడు
2019, మేలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఉంచిన గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే విధ్వంసం జరిగిందని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు తేలి్చచెప్పారు. 2020లో గోదావరికి భారీ వరదలు సంభవించాయి. 22 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలతో కాఫర్‌ డ్యామ్‌ దిగువన, ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–2 ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక కోత పడిందని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు తేల్చారు.

వాస్తవం:  2014, జూన్‌ 8 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబే అధికారంలో ఉన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి 2016, డిసెంబర్‌ 30 వరకూ అంటే  31 నెలలపాటు పోలవరంలో చంద్రబాబు తట్టెడు మట్టి పోయించింది లేదు. నిర్మాణ బాధ్యతలను కేంద్రమే తీసుకున్నా... ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డంపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి.. కాంట్రాక్టర్లకు బాగా మిగిలి్చ, అధికంగా కమీషన్లొచ్చే ఈజీ పనులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పైన స్పిల్‌ చానెల్‌ పూర్తి చేసి... స్పిల్‌ వే నిరి్మస్తే నీరు అటు మళ్లుతుంది. అప్పుడు కాఫర్‌ డ్యామ్‌లు నిర్మించి ప్రధాన డ్యాం పనులు చేపడితే ఇబ్బందులుండవు. కానీ స్పిల్‌ వే పునాది స్థాయిలో ఉన్నప్పుడే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేపట్టారు చంద్రబాబు. వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేశారు. చివరకు ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలు (300 మీటర్లు, 380 మీటర్లు చొప్పున) వదిలేశారు.  

జగన్‌ సీఎంగా 2019, మే 30న బాధ్యతలు స్వీకరించారు. వెంటనే... అంటే జూన్‌ 14 నాటికే గోదావరి వరద పోలవరాన్ని ముంచెత్తింది. ఎలాంటి పనులూ చేయలేని పరిస్థితి. ఆ 15 రోజుల్లో... చంద్రబాబు ఐదేళ్లలో పూర్తి చేయలేని పనిని సీఎం వైఎస్‌ జగన్‌ చేయగలరా? హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు సకాలంలో పనులు పూర్తి చేయలేదని ఎత్తిచూపింది చంద్రబాబు సర్కార్‌నే. కానీ.. దాన్ని రామోజీ వక్రీకరించి.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌పైకి నెట్టడానికి గోబెల్స్‌ను తలదన్నే రీతిలో చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతున్నారు.  

పైపెచ్చు కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలు పూడ్చకపోవటం వల్లే ప్రాజెక్టులో విధ్వంసం జరిగిందని, దాన్ని పూడ్చేసి ఉంటే ఇబ్బందులుండేవి కావని మార్గదర్శితో మందిని ముంచిన నిపుణుడి సలహా. ఎగువన స్పిల్‌ చానెల్‌ ద్వారా స్పిల్‌ వేకి ప్రవాహాన్నింకా అప్పటికి మళ్లించలేదు. అలా చేయకుండా కాఫర్‌ డ్యామ్‌ ఖాళీలు పూడ్చేస్తే మొత్తం నీరు నిండి కాఫర్‌ డ్యామ్‌ కొట్టుకుపోయేది కాదా? కాఫర్‌ డ్యామ్‌ అంటే జస్ట్‌ మట్టి కట్ట. కిందకు పోయే దారి లేక అంతటి నీరు నిల్వ ఉంటే ఆ కాఫర్‌ డ్యామ్‌ తట్టుకోగలదా? ఇదేనా రామోజీ నీకు నిపుణులు చెప్పింది? ఇంతకీ ఎవరా నిపుణులు? 

పనుల్లో తీవ్ర జాప్యం చేసిందెవరు? 

ఈనాడు
సరైన సమయంలో దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని పీపీఏ తప్పు పట్టిన మాట వాస్తవం కాదా? 

వాస్తవం:  ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయలేక.. చంద్రబాబు సర్కార్‌ వదిలేసిన గ్యాప్‌ల వల్ల గోదావరి అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌ 0 మీటర్ల నుంచి 640 మీటర్ల వరకూ కోతకు గురైంది. ఆ ప్రాంతంలో జెట్‌ గ్రౌటింగ్‌ చేస్తూ.. జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. వాటిని అగాధం ఏర్పడిన ప్రాంతంలో వేసి.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుతో ఈ ఏడాది జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఏప్రిల్‌ ఆఖరులో పీపీఏ, డీడీఆరీ్ప, సీడబ్ల్యూసీలు సూచించాయి. జియో మెంబ్రేన్‌ బ్యాగ్స్‌ వినియోగం తక్కువ. వాటి లభ్యత కూడా అంతంత మాత్రమే. అయినా సరే గుజరాత్, అస్సోంలలో వాటిని ఉత్పత్తి చేసే సంస్థలకు ఆర్డర్‌ ఇచ్చి.. 2.50 లక్షల జియో మెంబ్రేన్‌ బ్యాగ్స్‌ను సేకరించారు.  

జెట్‌  గ్రౌటింగ్‌ విఫలమవుతుండటంతో ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు కష్టమైన పాలీయురిథేన్‌ (పీయూ) గ్రౌటింగ్‌ చేస్తూ.. జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. గోదావరికి అనుకోకుండా ఈ సారి వరదలు ముందే వచ్చాయి. దీంతో జూలై 10న అర్ధరాత్రి స్పిల్‌ వే నుంచి దిగువకు విడుదలైన వరద దిగువ కాఫర్‌ డ్యామ్‌ మీదుగా ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలోకి చేరి నిర్మాణ పనులను ముందుకెళ్లకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 31 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయడం ఎలా సాధ్యం రామోజీరావ్‌? ఇదే అంశాన్ని పీపీఏకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వివరించారు. వరదలు తగ్గాక.. యుద్ధప్రాతిపదికన దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేస్తామని ఇచ్చిన వివరణతో పీపీఏ సంతృప్తి చెందింది. వరదల్లోనూ పనులు చేస్తూ.. పూర్తి చేసినట్లు గ్రాఫిక్స్‌ను సృష్టించి.. అదే నిజమని నమ్మబలికే చంద్రబాబే అబద్ధాల్లో మీకు సరైన జోడీ. 

కళ్లుండి చూడలేకపోతే ఎలా? 

ఈనాడు
అప్రోచ్‌ ఛానల్‌ పూర్తి చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. కానీ.. ఇప్పటికీ పూర్తి కాలేదు. సులువుగా జరిగే మట్టి తవ్వకం పనులూ చేయలేదు. 2019లో సీఎం వైఎస్‌ జగన్‌ తొలి సమీక్ష నిర్వహించే నాటికే ప్రధాన డ్యామ్‌ పనులు 64.08 పనులు పూర్తయ్యాయి. తాజా నివేదికల ప్రకారం 76 శాతం పనులుపూర్తయ్యాయి. మూడేళ్లలో 12 శాతం పనులు చేయడాన్ని గణనీయమైన ప్రగతి అంటారా? 

వాస్తవం:  చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దితూ పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో 48 గేట్లతోసహా స్పిల్‌ వేను పూర్తి చేశారు. అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి.. 2021, జూన్‌ 11న 6.1 కిమీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ఇది గణనీయమైన ప్రగతి కాదా? కళ్లుండి చూడలేకపోతే ఎలా రామోజీ..? అధికారంలో మీ బాబు ఉంటే ఇవన్నీ మీకు త్రీడీలో కనిపించేవేమో!!. మీ బాబు గ్రాఫిక్స్‌ చూపించినా ప్రాజెక్టును పూర్తి చేసినట్లు బాకాలూదటంలో ఆరితేరిన మీకు తస్మదీయుడు సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసిన పనులు కన్పించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. 

పునరావాసానికి పెద్దపీట.. 

ఈనాడు
పీపీఏ లెక్కల ప్రకారం 9,229 మందికే పునరావాసం కల్పించారు. ఇంకా 9,390 మందిని తరలించాలి. ఇందుకు ఇంకా రూ.2173.61 కోట్లు అవసరం. నిజానికి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ 41.15 మీటర్ల స్థాయికి పూర్తి చేయడానికి ముందే వీరికి పునరావాసం కల్పించాలి.

వాస్తవం:  41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో 20,946 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు అవుతారు. ఇందులో 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందే 207 కుటుంబాలకు రూ.44.77 కోట్ల వ్యయంతో పునరావాసం కల్పించారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ సర్కార్‌ హయాంలో 3073 కుటుంబాలకు రూ.193 కోట్లతో పునరావాసం కల్పించారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని వారికి చంద్రబాబు సర్కార్‌ పునరావాసం కల్పించకుండా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేస్తుంటే అప్పట్లో అది ‘ఈనాడు’కు కనిపించనే లేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే కమీషన్లు రావన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వాటిని పట్టించుకోలేదన్నది రామోజీ తప్ప జగమెరిగిన వాస్తవం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో 10,330 నిర్వాసితుల కుటుంబాలకు రూ.1773 కోట్లతో పునరావాసం కల్పించారు. మిగతా 6,836 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులు శరవేగంగా సాగుతుండటం కళ్లున్న కబోది రామోజీకి కన్పిస్తాయనుకోవడం అత్యాశే.  

మరిన్ని వార్తలు