గడప ముంగిటకే ప్రభుత్వ సేవలు
విపత్తుల్లోనూ స్వచ్ఛందంగా ముందుకు..
పింఛన్ మొదలు సర్వేల వరకూ వలంటీర్లే కీలకం
నిబద్ధతతో సేవలందిస్తున్నా ‘ఈనాడు’ విషపు రాతలు
కక్షపూరిత రాతలపై వలంటీర్ల మండిపాటు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వలంటీర్లు ప్రతి ఇంట్లో తలలో నాలికలా మారారు. గతంలో పెన్షన్ నుంచి ఏ చిన్నపాటి ప్రభుత్వ సేవలు అవసరం ఉన్నా తహసీల్దార్ లేదా మండల కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ముంగిళ్లలోకే సేవలందించేలా రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు శ్రీకారం చుట్టింది.
పెన్షన్ మొదలు ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుడి ఇంటికే చేరేలా సరికొత్త విధానాన్ని అమలుచేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలకు రోల్మోడల్గా నిలుస్తోంది. అలాంటి వలంటీర్ వ్యవస్థపై ఈనాడు మీడియా విషంచిమ్మింది. వ్యవస్థను నిర్వీ ర్యం చేసేలా, ప్రజలను మభ్యపెట్టేలా రాసిన కథనంపై వలంటీర్లు మండిపడుతున్నారు. గురువారం తణుకులో వలంటీర్లు ‘ఈనాడు’కు వ్యతిరేకంగా నిరసన ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో 20,749 మంది..
ఉమ్మడి పశ్చిమగోదావరిలో 20,749 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వీరిలో 16,330 మంది గ్రామీణ, 4,419 మంది పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు నిర్దేశించిన విధులే కాకుండా విపత్తులు, పెనుప్రమాదాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పెన్షన్ మొదలు సర్వేల వరకు అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. సంక్షేమ పథకాలకు పూర్తి బాధ్యత వహించడంతో పాటు అర్హత ఉండి పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా పూర్తి చేయాలనేది వివరిస్తూ లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆన్లైన్ చేస్తున్నారు. దీంతో ప్రజలకు పౌరసేవలు సులభతరమయ్యాయి.
వరదల్లో కీలక సేవలు
ఈ ఏడాది జూలై రెండో వారంలో జిల్లాలో గోదావరి ఉధృతికి పలు మండలాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించారు. దీంతో వరద సాయం, నష్టపరిహారం, పునరావాస కేంద్రాల తరలింపు ప్రక్రియలు సులభంగా జరిగిపోయాయి. వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, యలమంచిలి, నరసాపురం మండలాల్లో దాదాపు 750 మందికిపైగా వలంటీర్లు ఆహార ప్యాకెట్ల పంపిణీ, పునరావాస కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా వలంటీర్ల సేవలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం సేవా మిత్ర పురస్కారం పేరుతో రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం అందిస్తోంది. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సేవా రత్న (రూ.15 వేలు), సేవా వజ్ర (రూ.20 వేలు) పురస్కారాలతో ప్రోత్సహిస్తోంది.
రామోజీరావు క్షమాపణ చెప్పాలి
తణుకు అర్బన్: వలంటీర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఈటీవీలో కథనాన్ని ప్రసారం చేశారంటూ గురువారం తణుకులో వలంటీర్లు నిరసనకు దిగా రు. ఎంతో సేవాదృక్పథంతో సేవ చేస్తున్న తమపై అసత్యా కథనాలు ప్రసారం చేస్తున్న ఈనాడు రామోజీరావు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనంతో పనిచేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారికి అందాల్సిన ప్రతి లబ్ధిని గుమ్మంలోకే చేరుస్తున్న తమపై అభాండాలు మోపుతారా అంటూ ఈటీవీకి వ్యతిరేకంగా గళమెత్తారు. కోవిడ్ సమయంలో గాలి ద్వారా కూడా వైరస్ సోకుతుందనే ప్రచారం ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి రెడ్జోన్లో బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించామని, వ్యాక్సిన్లు వేయించేందుకు తీసుకువెళ్లామని, సూర్యోదయం కాకుండానే అవ్వాతాతలకు పింఛను సొమ్ము అందచేసినందుకా తమను వేగులుగా చిత్రీకరిస్తున్నారంటూ వలంటీర్లు ఉన్నమట్ల ప్రదీప్, అధికారి చిన్నారి, ఇమ్మిడి సూరిబాబు, తణుకు జగదీష్లు రామోజీరావుకు ప్రశ్నలు సంధించారు. మానవత్వంతో పనిచేస్తున్న తమపై నిందలు మోపుతారా అంటూ దుయ్యబట్టారు.
ప్రేమాభిమానాలు పొందుతూ..
నేను 2019 నుంచి వలంటీర్గా సేవలు అందిస్తున్నా. నాకు కేటాయించిన 50 కుటుంబాల లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అందించడంతో వారి ప్రేమాభిమానాలను పొందాను. నా సర్వీసులో సేవా రత్న అవార్డు అందుకున్నా. వలంటీర్గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సొంత గ్రామంలో ప్రజలకు సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నా.
–ఎం.దేవి ప్రసన్న, దెయ్యాలతిప్ప, భీమవరం మండలం
సంతృప్తికరంగా విధులు
వలంటీర్ విధులు సంతృప్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో రెడ్జోన్లో ఉంటూ బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించడం, వ్యాక్సిన్లు వేయించడం వంటి సేవలు చేశాను. గౌరవ వేతనం రూ.5 వేలే అయినా ఆ సేవలో ఎంతో సంతోషం పొందుతున్నా. నా పరిధిలోని 50 కుటుంబాల వారు నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు.
– ఉన్నమట్ల ప్రదీప్, 12వ వార్డు, తణుకు
దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం
పక్క రాష్ట్రాలు కూడా వలంటీరు వ్యవస్థను ఏర్పాటుచేయాలనుకుంటున్న సమయంలో ఈటీవీలో వలంటీర్లను వేగులుగా వర్ణిస్తూ దు
ష్ప్రచారం చేయడాన్ని మేమంతా ఖండిస్తు న్నాం. వలంటీరు వ్యవస్థను నిర్వీర్యం చే యాలనే దురుద్దేశంతోనే అసత్య ప్రచారాలకు తెరతీశారు. దీనికి బాధ్యత వహిస్తూ రామోజీరావు తక్షణమే వలంటీర్లందరికీ క్షమాపణ చెప్పాలి.
– అధికారి చిన్నారి, తణుకు
వరద ప్రభావిత ప్రాంతాల్లో విశేష సేవలు
ఈమె పేరు కరటం రమ్య. స్వగ్రామం వేలేరుపాడు మండలంలోని చిన్నబుర్రతోగు. గతంలో కూలి పనికి వెళ్లేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ ఉద్యోగం వచ్చింది. పెద్దబుర్రతోగు గ్రామ వలంటీర్గా పనిచేస్తోంది. గత జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన గోదావరి వరదల సమయంలో ‡ఈమె పరి«ధిలోని శివకాశీపురం, భూదేవిపేట, బండలబోరు, రామవరం, మేడేపల్లి పునరావాస కేంద్రాల్లో నిత్యావసర సరుకులు అందించడంలో కీలకంగా పనిచేసింది. బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది.
బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి..
ఇతడి పేరు బందం లక్ష్మణ్రావు. స్వగ్రామం వేలేరుపాడు మండలంలోని పూచిరాల కాలనీ. గ్రామంలో వలంటీర్గా పనిచేస్తున్నాడు. గత జూన్ నెలాఖరున రేపాకగొమ్ము గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. ఇక్కడ 450 కుటుంబాలు ఉన్నాయి. రెండు నెలలపాటు వరద గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ఈ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయించడంలో కీలకంగా వ్యవహరించాడు. బోటులో గ్రామస్తులను పల్లపు ప్రాంతాలకు తరలించడంలో తన వంతు కృషి చేసి మన్ననలు పొందాడు.