రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..

29 Apr, 2022 16:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు: బీటెక్‌ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నిందితుడి శశిక్రిష్టకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై రమ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామని రమ్య తల్లి అన్నారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇంత వేగంగా కేసు పూర్తవుతుందనుకోలేదన్నారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ కేసు విచారణలో ఎక్కడా ఏ చిన్న అలక్ష్యం జరగలేదన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి మాకు పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. 

ఇదిలా ఉంటే,  గతేడాది ఆగస్టు 15న తనను ప్రేమించడంలేదంటూ టిఫిన్‌ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన బీటెక్‌ విద్యార్థి రమ్యను శశికృష్ణ దారుణంగా పొడిచి చంపాడు. ఘటన జరిగిన 9 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్‌ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్‌ ఎవిడెన్స్‌ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు.

చదవండి: (బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు)

కేసు వివరాలిలా..
ఆగస్టు 15, 2021న రమ్య హత్య
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు
10 గంటల వ్యవధిలో అరెస్టు
2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నిర్ధారణ
దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్‌ ఫలితాలు
ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు 
క్రమం తప్పకుండా కోర్టు విచారణ
వాదనలు వినిపించిన దిశ ప్రత్యేక న్యాయవాది
257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు 
ఏప్రిల్‌ 29, 2022న నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

మరిన్ని వార్తలు