బంగారు 'మేషువా'.. ‘అల్లూరి’ జిల్లాలో అరుదైన వృక్షాలు

9 Sep, 2022 04:06 IST|Sakshi

ఔషధ గుణాల మేళవింపు  రంగులు మార్చే ఆకులు

పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరుతున్న గిరిజనులు 

హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో తూర్పు కనుమల్లో పలు చోట్ల ఔషధ గుణాలున్న అరుదైన మేషువా ఫెరే చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ చెట్లను గిరిజనులు ఉప్ప, బంగారం చెట్లుగా పిలుస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బంగారం గరువు అనే చిన్న గ్రామంలో సుమారు 25 ఎకరాల్లో 1,500 చెట్లున్నాయి. ఈ చెట్ల వల్లే అక్కడ ఉన్న గ్రామానికి బంగారం గరువు అని పేరొచ్చింది.

ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,050 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వృక్ష జాతి వైద్య, వాణిజ్య పరంగా చాలా విలువైంది. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఇవి చిగురిస్తాయి. ఆసక్తికర విషయమేంటంటే ఈ చెట్లు చిగురించేప్పుడు వాటి ఆకులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఆకులు మొదట లేత ఎరుపు రంగు, తర్వాత గోధుమ రంగు, ఆ తర్వాత లేత ఆకుపచ్చ రంగు, చివరిగా పూర్తి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. వీటి పువ్వులు తెలుపు రంగులో పెద్దవిగా ఉంటాయి. వీటిని గిరిజన స్త్రీలు అలంకరణ కోసం వినియోగిస్తారు. మంచి సువాసన ఉండటంతో వాణిజ్య పరంగా సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తున్నారు.  

ఈ చెట్లను గిరిజనులు నరకరు 
ఈ పువ్వులు ఫలదీకరణం చెంది పూర్తి ఫలాలుగా మారేందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఒక్కో ఫలంలో ఒకటి నుంచి నాలుగు గింజలుంటాయి. ఇవి నూనె స్వభావం కలిగి ఉండటం వల్ల కాల్చినప్పుడు కొద్ది సమయం పాటు వెలుగుతాయి. గతంలో ఈ గింజలను అక్కడి గిరిజనులు వెలుగు కోసం వినియోగించేవారు. వీటి నుంచి తీసిన నూనెను తలకు రాసుకోవడానికి, దీపాలు వెలిగించేందుకు, చర్మ వ్యాధుల నివారణకు వినియోగిస్తారు.

ఈ చెట్లు ఉన్న స్థలంలో పూర్వం నుంచి ఓ ఆలయం ఉంది. ఆలయంలో ఉన్న దేవతను గంగమ్మగా కొలుస్తారు. ఆ ప్రాంతంలో జాతర నిర్వహిస్తారు. ఈ స్థలాన్ని అటవీశాఖ రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ వృక్షాలను నరికేందుకు గిరిజనులు ఇష్టపడరు. అయితే ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ చెట్లను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. 
అత్యంత ఔషధ గుణాలున్న ఉప్ప చెట్లను పరిరక్షించాల్సిన అవసరముంది. ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి     
– డాక్టర్‌ సమరెడ్డి శ్రావణ్‌కుమార్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్,ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, బాబా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విశాఖపట్నం 

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కృషి 
దేశంలోనే అరుదైన ఉప్ప చెట్లు ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇప్పటికే  పలుమార్లు ఉన్నతాధికారులతో చర్చించాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పర్యాటక ప్రాంతంబబగా అభివృద్ధి చేస్తాం.  
 – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే 

మరిన్ని వార్తలు