విశాఖలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం

7 Feb, 2023 02:46 IST|Sakshi

ఇటీవలే విశాఖలో పలు ప్రాంతాలు సందర్శించిన ఆర్‌బీఐ బృందం

500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు సన్నాహాలు

సాక్షి, విశాఖపట్నం: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రాంతీయ కార్యాలయాన్ని విశా­ఖ­­పట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపా­లన్నీ హైదరా­బాద్‌­లోని రిజర్వ్‌ బ్యాంక్‌ కార్యాల­యం నుంచే కొనసాగించింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన లావా­దేవీలన్నీ అక్కడి నుంచే జరుగుతు­న్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశా­లకు హైదరాబాద్‌ నుంచే అధికారులు విజయవా­డకు వస్తున్నారు. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కష్టసాధ్యమవుతుందని.. రాష్ట్రంలోనే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్‌­బీఐ ఉన్నతా­ధికారులు నిర్ణయించారు. ఈ క్రమం­లో విశాఖ­లో ఆర్‌బీఐ బృందం ఇటీవల పర్యటించిం­ది. జిల్లా అధికారులతో చర్చించి పలు భవ­నాలను పరిశీలించింది. 500 మంది ఉద్యో­గులతో ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. 

నిర్మాణం పూర్తయిన భవనం వైపే మొగ్గు..
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు దాదాపు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం అవసరమని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బృందం జిల్లా కలెక్టర్‌ డా.మల్లికార్జునతో సంప్రదింపులు జరి­పింది. 500 మంది ఉద్యోగులతో ప్రాంతీ­య కార్యాలయాన్ని ఏర్పాటు చేయను­న్నట్లు ప్రభుత్వానికి ఇప్పటికే వివరించినట్టు ఆర్‌బీఐ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో విశా­ఖపట్నంలో మధురవాడ, రుషికొండ, ఆరి­లోవ, కొమ్మాది, భీమిలి, హనుమంతువాక, కైలాసగిరి, సాగర్‌నగర్‌ పరిధిలోని పలు భవ­నాల్ని పరిశీలించారు.

కార్యాలయ నిర్మాణా­నికి ఏపీఐఐసీకి చెందిన స్థలం సిద్ధంగా ఉందని జిల్లా అధికార యంత్రాంగం సూచించింది. అయితే వెంటనే కార్యకలా­పాలు ప్రారంభించడానికి నిర్మాణం పూర్త­యిన భవనమైతే అనుకూలంగా ఉంటుందని ఆర్‌బీఐ అధికా­రులు తెలిపారు. దీంతో భవ­నాల పరిశీల­నలో కొందరు ఉద్యోగులు నిమ­గ్న­మైనట్లు కలెక్టరేట్‌ వర్గాలు వెల్లడించాయి. తాము అను­కున్న విధంగా భవనం లభిస్తే నెల వ్యవధి­లోపే కార్యకలాపాలు ప్రారంభి­స్తా­మని ఆర్‌బీఐ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. 

మరిన్ని వార్తలు