సాగులో యాంత్రీకరణకు రూ.1,700 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడి
మండపేట: రైతులకు మంచి ధర అందించడమే లక్ష్యంగా రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)ల్లో త్వరలో మార్కెటింగ్ సేవలను అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రకృతి విధానంలో తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారిగా బీపీటీ 2841 నల్ల రకం బియ్యం సాగును మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పొలంలో మంత్రి కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ సోమవారం ప్రారంభించారు. మంత్రి కన్నబాబు ఏమన్నారంటే..
► సాగుదారులకు మంచి ధర అందేలా రైతులకు, కొనుగోలుదారునికి మధ్య ఆర్బీకేల్లోని మార్కెటింగ్ కేంద్రాలు అనుసంధానంగా పనిచేస్తాయి. సరైన ధర లేకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
► అవినీతి,అక్రమాలకు తావులేకుండా ఏడాదిలో రూ.10,200 కోట్ల సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.
► సాగులో కూలీల కొరతను అధిగమించేందుకు ఈ ఏడాది రూ.1,700 కోట్లతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నాం.
► కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంట్ జిల్లా కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు, వ్యవసాయశాఖ జేడీ కేఎస్ఎస్.ప్రసాద్, డీడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.