జగనన్న ‘స్మార్ట్‌ టౌన్‌’కు వేగంగా అడుగులు 

11 Aug, 2021 07:57 IST|Sakshi

మున్సిపల్‌ ఆర్డీ, రాజమహేంద్రవరం

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’కు ప్రతిపాదనలు

పట్టణాల్లో తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు

మధ్యతరగతికి మంచి అవకాశం

వచ్చిన దరఖాస్తులు 41,504

అవసరమైన భూమి 3,215 ఎకరాలు

కాకినాడ మినహా స్థల సేకరణకు

అంచనా వ్యయం రూ. 2,128 కోట్లు

మండపేట: పట్టణాల్లోని మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి అడుగులు పడుతున్నాయి. తక్కువ ధరకే స్థలం అందించేందుకు ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన వారికి స్థలాల పంపిణీకి 3,215 ఎకరాల భూమి అవసరమని అంచనా. కాకినాడలో 1,284 ఎకరాలు పరిశీలిస్తున్నారు. మిగిలిన పట్టణాల్లో 1,931 ఎకరాల సేకరణకు రూ.2,128 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా.

పట్టణాల్లో సెంటు భూమి కొనాలన్నా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో  సొంతింటిపై ఆశలు వదులుకున్న మధ్య తరగతి వర్గాల వారికి ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’ పథకం కొత్త ఉత్సాహం కలిగించింది. మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా సొంతిల్లు సమకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పట్టణం సమీపంలో భూములు సేకరించి మార్కెట్‌ ధర కంటే తక్కువకు స్థలాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ స్థలాల్లో మౌలిక వసతులు కల్పించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులకూ అవకాశం కలి్పంచింది. లబి్ధదారుల వార్షికాదాయం మేరకు మూడు, నాలుగు, ఐదు సెంట్ల చొప్పున కేటగిరీలుగా స్థలాలు పొందేందుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలీ్టలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సిద్ధమైన ప్రతిపాదనలు
ఆయా కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఈ పథకానికి జిల్లాలో 3,215 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో 1,284 ఎకరాలు అవసరమవుతుండగా స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మిగిలిన పట్టణాల్లో ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించిన అధికారులు అక్కడి ధరల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఎకరం భూ సేకరణకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకూ అవుతుందని అంచనా.

స్థల సేకరణ జరగాలి
ఎంఐజీ స్కీంకు జిల్లాలో మూడు కేటగిరీల్లో 41,504 దరఖాస్తులు వచ్చాయి. స్థల పంపిణీకి దాదాపు 3,215 ఎకరాల వరకూ అవసరమవుతుందని ఇప్పటికే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు గుర్తించారు. స్థల సేకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది.
- రంగనాయకులు, మున్సిపల్‌ ఆర్డి, రాజమహేంద్రవరం

మరిన్ని వార్తలు