ఆరోగ్య శాఖకు జవసత్వాలు

31 Oct, 2020 19:37 IST|Sakshi

రెగ్యులర్‌గా 9,932, జాతీయ హెల్త్‌ మిషన్‌ పరిధిలో 2,919 పోస్టుల భర్తీ

ఇప్పటికే బోధనాస్పత్రుల్లో విధుల్లో చేరిన 582 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరో 592 మంది వైద్యులు

పేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు

సాక్షి, అమరావతి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పుడు కొత్త సందడి నెలకొంది. గత ప్రభుత్వం ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోవడంతో దారుణ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఆస్పత్రులు ప్రస్తుతం కొత్త రూపును సంతరించుకున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చిన సంగతి తెలిసిందే. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది.

దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నీ కొత్త జవసత్వాలు సంతరించుకున్నాయి. ఇన్నాళ్లూ స్పెషలిస్టు డాక్టర్లు లేక కునారిల్లిన బోధనాస్పత్రులు ఇప్పుడు ఒక్కసారిగా 582 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల చేరికతో కళకళలాడుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఇప్పటికే 592 మంది వైద్యులు చేరారు. దీంతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇద్దరు డాక్టర్లతో పనిచేస్తున్నాయి. ఫలితంగా పేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. 

ఇదే అతిపెద్ద నియామక ప్రక్రియ
- రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇదే అతిపెద్ద నియామక ప్రక్రియ
- ఒకేసారి 2,094 పోస్టుల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికే విధుల్లో 1,368 మంది చేరిక. మిగిలిన పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగింపు
- జిల్లా స్థాయిలో మెడికల్, పారామెడికల్‌ తదితరాలకు సంబంధించి 7,838 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తి. వీరిలో ఇప్పటివరకు విధుల్లో చేరినవారు 4,979 మంది.
- నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ద్వారా మరో 2,919 పోస్టులకు కొనసాగుతున్న నియామక ప్రక్రియ
- రాష్ట్రంలో 30 శాతం వరకు మానవవనరులు పెరిగినట్టు అంచనా

వైద్యుల నియామకాలు.. 

విభాగం  మంజూరైన పోస్టులు ఇప్పటివరకు నియామకాలు
వైద్య విద్యా శాఖ 737 582
వైద్య విధాన పరిషత్‌ 692 194
ప్రజారోగ్య శాఖ 665 592

జిల్లాల వారీగా..

వైద్య విద్యా శాఖ 3,680 1,866
వైద్య విధాన పరిషత్‌ 1,678 1,161
ప్రజారోగ్య శాఖ 2,480 1,952
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ 2,919 ప్రక్రియ కొనసాగుతోంది

మరిన్ని వార్తలు