ఐఐటీ, ఎన్‌ఐటీ అభ్యర్థులకు ఊరట

22 Sep, 2020 05:46 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో నిబంధనల సడలింపు

జేఈఈ అడ్వాన్స్, మెయిన్‌ అర్హతతో ప్రవేశాలు

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్‌ 20 పర్సంటైల్‌ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.

కోవిడ్‌ నేపథ్యంలో మినహాయింపు
► కోవిడ్‌–19 నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
► దీంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. 
► ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్‌లో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెయిన్‌లో మెరిట్‌ సాధించి ఉండాలి. 
► ఈసారి కోవిడ్‌ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయవచ్చు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 

వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు
► జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 
► అడ్మిట్‌ కార్డులో అభ్యర్థి పేరు, రోల్‌ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
► ఈ ఏడాది మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినా కేవలం 1,60,864 మందే పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. 

222 నగరాల్లోని 1,150 కేంద్రాల్లో...
► ఫలితాలు అక్టోబర్‌ 5న విడుదలవుతాయి. అక్టోబర్‌ 6 నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనుంది. 
► ఈసారి కౌన్సెలింగ్‌ ప్రక్రియను 7కు బదులు 6 విడతల్లోనే ముగిస్తారు. అభ్యర్థులకు అవగాహన కోసం 2 విడతల మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.
► ఐఐటీలతో పాటుగా జేఈఈ అడ్వాన్స్‌ ర్యాంక్‌తో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పూనే, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
► తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రాయబరేలీలోని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం సంస్థల్లో ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు.  

మరిన్ని వార్తలు