15లోగా 'సచివాలయ' ఫలితాలు

8 Oct, 2020 03:47 IST|Sakshi

నేడు రాతపరీక్షల ఫైనల్‌ కీ విడుదల 

ఓఎమ్మార్‌ షీట్ల స్కానింగ్‌ ఇప్పటికే పూర్తి 

తుది కీ,జవాబుల వివరాల అనుసంధానంతో మార్కుల జాబితా 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15వ తేదీ కల్లా ఫలితాల వెల్లడి పూర్తవుతుందని తెలిపాయి. ఆ తర్వాత మరో వారం రోజుల వ్యవధిలోనే జిల్లా సెలక్షన్‌ కమిటీల ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. 19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాతపరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం 10,57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది పరీక్షలకు హాజరయ్యారు. 

► రాతపరీక్షలకు సంబంధించిన ఫైనల్‌ కీని ఏపీపీఎస్‌సీ అధికారులు గురువారం ప్రకటిస్తారు. కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. 
► జవాబుల ఓఎమ్మార్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థుల జవాబుల వివరాలతో పైనల్‌ కీ అనుసంధానం చేసి మార్కుల జాబితాలను తయారు చేయనున్నారు.  
► ఈ ప్రక్రియ ముగియగానే ర్యాండమ్‌గా కొందరు అభ్యర్థుల మార్కులు కంప్యూటరీకరణ ప్రక్రియ ద్వారా, ప్రత్యక్ష పరిశీలనలోనూ అదే అభ్యర్థుల మార్కుల వివరాలను సరిపోల్చనున్నారు. ఆ తర్వాత రాతపరీక్షల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి.   

మరిన్ని వార్తలు