ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్ కు వెల్లడి
ఇందుకోసం శ్రీ చక్ర ఎకోటెక్స్తో ఒప్పందం
సాక్షి, అమరావతి: పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేందుకు ఏపీలో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా తమ రీసైక్లింగ్ సామర్థ్యం రెట్టింపు అవుతుందని ఆర్ఐఎల్ బుధవారం స్టాక్ ఎక్స్చేంజ్ లకు తెలియజేసింది. 100% రిలయన్స్ అవసరాల కోసం శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ యూనిట్ను ఏర్పాటు చేసి నిర్వహిస్తుందని పేర్కొంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైర్మన్ ముఖేష్ అంబానీ ఆలోచనల మేరకు ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఐఎల్ పెట్రో కెమికల్స్ బిజినెస్ సీవోవో విపుల్ షా తెలిపారు. రిలయన్స్తో ఒప్పందం ద్వారా ప్లాస్టిక్ రీ సైక్లింగ్లో విస్తరించడానికి తమకు అవకాశం దొరికిందని శ్రీచక్ర ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస్ మిక్కిలనేని చెప్పారు. రీసైకిల్ చేసిన వస్తువులను రిక్రాన్ గ్రీన్ గోల్డ్ ఫాబ్రిక్స్ పేరుతో రిలయన్స్ విక్రయిస్తోంది.