7వ తేదీలోపు 17 వేల పోస్టుల భర్తీ

5 Aug, 2020 03:59 IST|Sakshi

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడి

కర్నూలు కోవిడ్‌ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ఆరా

కర్నూలు (సెంట్రల్‌):  కరోనా వైద్య సేవల కోసం స్పెషలిస్టు వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, స్టాఫ్‌నర్సులు, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పోస్టులను ఈ నెల 7వ తేదీలోపు భర్తీ చేస్తామన్నారు. ఆయన మంగళవారం కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోవిడ్‌ ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లలోని వసతులపై రోగులతో ఆరా తీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..

► రెగ్యులర్‌ వైద్య సిబ్బంది పోస్టులను 10వ తేదీలోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించాం. కరోనా రోగుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
► వెంటిలేటర్లు,ఆక్సిజన్‌ బెడ్లు, మందుల కొరత లేదు. కోవెలకుంట్ల మండలం ఉయ్యాలవాడకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటున్నారని, మంచి భోజనం పెడుతున్నారని తెలిపారు.  కోడుమూరుకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. అమీలియో కోవిడ్‌ ఆస్పత్రిలో సదుపాయాలు బాగున్నాయని వివరించారు. మంత్రి బుగ్గన, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు