ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,634 రెగ్యులర్‌ పోస్టుల భర్తీ

24 Dec, 2020 03:39 IST|Sakshi

ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో నియమించడం ఇదే తొలిసారి

జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో పోస్టులు 6,106 

రాష్ట్ర స్థాయి ఆస్పత్రుల్లో పోస్టులు 1,528

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి, పరోక్షంగా ప్రైవేట్‌ ఆస్పత్రులను ప్రోత్సహిస్తే, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏకంగా 7,634 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేశారు.

జిల్లా స్థాయిలో డైరెక్టర్‌ మెడికల్‌ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ కింద ఆస్పత్రుల్లో మొత్తం 7,590 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి అనుమతించగా ఇప్పటి వరకు 6,106 పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్‌ మెడికల్‌ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ కింద 2,120 పోస్టులు మంజూరు చేయగా ఇప్పటి వరకు 1,528 పోస్టులను భర్తీ చేశారు. మిగతా 592 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతోందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా స్థాయిలో మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.  

 

మరిన్ని వార్తలు