అస్తమించిన యుద్ధ వీరుడు.. సీఎం జగన్‌ సంతాపం

28 Apr, 2021 15:06 IST|Sakshi

రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ వేణుగోపాల్‌ కన్నుమూత  

తిరుపతి (అన్నమయ్య సర్కిల్‌): దేశ సరిహద్దుల్లో శత్రువుతో వీరోచిత పోరాటం చేసి పదవీ విరమణ పొందిన యుద్ధవీరుడు మాజీ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1927 నవంబర్‌ 14న జన్మించిన వేణుగోపాల్‌ దేశానికి సేవ చేయాలనే తపనతో ఆర్మీలో హవల్దార్‌గా చేరి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (డెహ్రాడూన్‌)లో సీటు సాధించారు.

అనంతరం లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు ఎదిగి, మేజర్‌ జనరల్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పరమ విశిష్ట సేవా మెడల్‌’, ‘మహా వీరచక్ర’ అవార్డులు అందుకున్నారు. 36 ఏళ్లు ఆర్మీలో కొనసాగిన ఆయన దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ వివాహానికి సైతం దూరంగా ఉన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 18న తిరుపతి వేదికగా జరిగిన సాయుధ దళాల స్వర్ణోత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన గృహానికి వెళ్లి సత్కరించారు. వేణుగోపాల్‌ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

సీఎం జగన్‌ సంతాపం
మాజీ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ (95) మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

చదవండి: ఏబీఎన్‌ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్‌ సంతాపం

మరిన్ని వార్తలు